కానీ.. కొత్తగా వచ్చిన ఒమిక్రాన్ వేరియంట్.. డెల్టా కంటే డేంజర్ అని ప్రపంచ ఆరోగ్య సంస్థ తేల్చడంతో అంతా ఆందోళన చెందుతున్నారు. అయితే ఈ ఒమిక్రాన్ పుట్టుకపై జరిగిన పరిశోధనలో ఓ ఆసక్తికరమైన విషయం వెలుగు చూసింది. అదేంటంటే.. ఒమిక్రాన్లో వచ్చిన పరివర్తనాల్లో కనీసం ఒకటి సాధారణ జలుబుకు కారణమయ్యే వైరస్ వల్లే కావచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇందుకు అనలిటిక్స్ ఎన్ఫరెన్స్ సంస్థ చేసిన పరిశోధన కారణంగా కనిపిస్తోంది.
కరోనా, జలుబు రెండూ సోకిన వ్యక్తిలో ఈ ఒమిక్రాన్ వేరియంట్ రూపొంది ఉంటుందని ఈ అనలిటిక్స్ ఎన్ఫరెన్స్ చేసిన అధ్యయనం చెబుతోంది. రెండు వైరస్లతో ఇన్ఫెక్ట్ అయిన కణంలో ఈ మ్యుటేషన్ చోటుచేసుకుని ఉండొచ్చని ఆ సంస్థ భావిస్తోంది. ఎందుకంటే.. ఈ రెండు వైరస్లు ఊపిరితిత్తులు, జీర్ణ వ్యవస్థల్లో ఒకేసారి కలిసి ఉండే అవకాశం ఉంది. అందువల్ల ఈ రెండు కలిసి ఈ కొత్త ఒమిక్రాన్ పుట్టుకొచ్చి ఉండొచ్చని అంచనా వేస్తున్నారు.
జలుబుకు కారణమయ్యే వైరస్లోని కొంత జన్యు పదార్థాన్ని ఈ కరోనా వైరస్ తీసుకొని ఉండొచ్చని భావిస్తున్నారు. ఒమిక్రాన్లో వచ్చిన అనేక మ్యుటెంట్లలో ఒకదానికి ఇది కారణం కావచ్చని భావిస్తున్నారు. ఈ మ్యుటేషన్ కారణంగానే ఒమిక్రాన్కు ఎక్కువగా వ్యాప్తి చెందే గుణం వచ్చి ఉండొచ్చని పరిశోధకులు అంచనా వేస్తున్నారు.