సీఎం జగన్ ఆ నియోజకవర్గంపై ప్రధాన దృష్టి సారించాడని ఈ జాబితానే ఉదాహరణ అని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. వచ్చే ఎన్నికల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్, వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణం రాజు కు చెక్ పెట్టేందుకే జగన్ ఆ నియోజకవర్గానికి చెందిన నేతలకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నారని టాక్ నడుస్తోంది. రాష్ట్రంలో భీమవరం నియోజకవర్గం వైసీపీ నేతలకు జగన్ అధిక ప్రాధాన్యత ఇస్తూ ఉండడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. వీలయినన్ని ఎక్కువ పదవులు ఆ నియోజకవర్గం నాయకులకే దక్కుతున్నాయనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.
అయితే, దీని వెనుక పవన్ కళ్యాణ్ కు, రఘురామకు చెక్ పెట్టే వ్యూహం దాగిఉన్నట్టు సమాచారం. 2024 ఎన్నికల్లో భీమవరం నియోజకవర్గం నుంచి పవన్ మరోసారి పోటీ చేస్తారనే ప్రచారం సాగుతోంది. మరోవైపు నర్సాపురం ఎంపీగా ఉన్న రఘురామరాజు పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోనే భీమవరం అసెంబ్లీ నియోజకవర్గం ఉంది. అందుకే భీమవరం నాయకులకు పదవులు ఇచ్చి అక్కడ పార్టీని మరింత బలోపేతం చేసి ఈ ఇద్దరికి షాక్ ఇవ్వాలని జగన్ యోచిస్తున్నట్టు స్పష్టం అవుతోంది. నర్సాపురం, బీమవరం ప్రాంతాల్లో క్షత్రియ ఓటు బ్యాంక్ ఎక్కువగా ఉంది. మిగిలిన నియోజకవర్గాల్లో కాపు సామాజిక వర్గం బలంగా ఉంది. దీంతో ఎస్సీ, బీసీ సామాజిక వర్గాలతో పాటు ఈ రెండు సామాజిక వర్గాలను తమ వైపు తిప్పుకుని రాబోయే ఎన్నికల్లో సత్తా చాటాలని జగన్ పావులు కదుపుతున్నారు.