ఏటా తీవ్ర తుఫానులు ఉత్తరాంధ్రను కకావికలం చేస్తున్నాయి. అయితే ఈ సారి ఈశాన్య రుతు పవన ప్రభావమో మరొకటో కానీ సీమ జిల్లాలనూ కొన్ని అల్ప పీడన వానలు తీవ్రంగా ప్రభావితం చేశాయి. ఈ నేపథ్యంలో తుఫాను వచ్చిన ప్రతిసారీ ఆస్తి, ప్రాణ నష్టాల అంచనాలతోనే కాలం గడిపేస్తున్న యంత్రాంగం అసలు వాటి నివారణకు తీసుకుంటున్న చర్యలేంటి అన్నది ఓ సారి ఆలోచించాలి. ముఖ్యంగా తీర ప్రాంతంలో తుఫాను వస్తే చాలు పూర్తిగా కంటి పై కునుకే ఉండదు. వేళకు పట్టెడన్నం దొరకదు. తీర ప్రాంత వాసులను సమీప సురక్షిత కేంద్రాలకు తరలించినా కూడా అక్కడ అందే సౌకర్యాలూ అంతంత మాత్రమే! ఈ నేపథ్యంలో తుఫాను నుంచి మనం ఏ పాఠాలు నేర్చుకుంటున్నామని!
నాలుగంటే నాలుగు తుఫానులు నాలుగు వేర్వేరు సందర్భాల్లో రెండు ప్రభుత్వాలను అతలాకుతలం చేశాయి. ముఖ్యంగా హుద్ హుద్ విలయ తాండవం అన్నది వైజాగ్ కు ఓ సవాలుగా మారింది. అసలు మళ్లీ వైజాగ్ కోలుకుంటుందా అన్నంతగా భయంకరంగా ఆ నగరం తయారైంది. చెట్లు కూలిపోయీ రహదారులన్నీ ఛిన్నాభిన్నం అయిపోయి అసలు అందాల విశాఖ తిరిగి తన రూపం పొందగలదా అన్నంత భయం వచ్చేసింది అందరిలో! అలాంటి సందర్భంలో అప్పటి సీఎం చంద్రబాబు చేసిన కృషి ఫలించి నగరం పరిధిలో మళ్లీ ఆశలు చివురించి అధికారుల చర్యలు ఫలించాయి. కానీ అప్పటి నుంచి తీరం కోతకు గురయ్యే సందర్భాల్లో ఏయే చర్యలు తీసుకోవాలన్న విషయమై చేసిన అధ్యయనాలు కానీ చేపట్టిన చర్యలు కానీ పెద్దగా లేవని చెప్పాలి.
ఆర్కే బీచ్ లో కొన్ని చెట్లు తీసుకు వచ్చి ఉంచారే కానీ మిగిలిన చోట్ల అది కూడా లేదు. అసలు సముద్ర తీర ప్రాంత పరిరక్షణ అన్నది లేనేలేదు. అదేవిధంగా తీర ప్రాంత సహాయార్థం ఏర్పాటు చేసే తుఫాను షెల్టర్ల తీరు కూడా అంతంతమాత్రంగానే ఉన్నాయి. వీటి నిర్వహణపై కూడా పెద్దగా ప్రభుత్వాలకు దృష్టే లేదు. హుద్ హుద్ వచ్చి వెళ్లాక దాతల సహకారంతో ఇంకొన్ని పనులు కూడా ఏపీ సర్కార్ చేపట్టగలిగింది. అటుపై తిత్లీ ప్రభంజనం సృష్టించింది. ఈ రెండు తుఫానులకూ ఉద్దానం వణికిపోయింది. హుద్ హుద్ కన్నా తిత్లీ ప్రభావం ఉద్దానంపై తీవ్రంగా ఉంది. దీంతో లోకేశ్ తో సహా ఇతరులు క్షేత్ర స్ధాయిలో పనులు చేపట్టారు. సహాయక చర్యలు ముమ్మరం చేశారు. అయితే నాటి గాయాల నుంచి ఇప్పటికీ ఉద్దానం అయితే కోలుకోలేదు.