వైసీపీ రాజకీయం వేరు
టీడీపీ రాజకీయం వేరు
అయితే ఎవ్వరైనా అంతిమంగా
ప్రజల దృష్టిని ఆకర్షించాలన్న తపనలోనే ఉంటారు
అంతేకానీ విచక్షణకు ప్రాధాన్యం ఇస్తూ మాట్లాడాలని మాత్రం తెలుసుకోరు.
రాజకీయంలో ఇదివరటి నీతి ఆశించలేం. రాజకీయంలో ఇదివరకటి నిబద్ధతలు పొందలేం. అంతిమంగా రాజకీయంలో ఏమీ ఉండవు కేవలం తిట్టుకోవడం మరియు తన్నుకోవడం తప్ప! తగాదాలు అన్నీ ఒకేవిధంగా ఉన్నాయి. ఉంటాయి కూడా! ఆంధ్రావనిలో రాజకీయాలు ఇందుకు భిన్నంగా ఏమీ లేవు. గతంలో టీడీపీ చేసిన తప్పిదాలనే వైసీపీ చేస్తూ కక్ష సాధింపునకు పాల్పడుతోంది. ఇష్టమొచ్చిన రీతిన ఆ రోజు టీడీపీ ప్రవర్తించి పరువు పోగొట్టుకుంది. అదే విధానంలో అదే పద్ధతిని ఎందుకు వదిలేయడం అని వైసీపీ కూడా ప్రవర్తిస్తోంది. టీడీపీ ని ఇరకాటంలో పెట్టి రాజకీయ లబ్ధి పొందాలన్న ఆలోచన తప్ప వైసీపీ ఇవాళ సాధించింది ఏమీ లేదు. ఉండదు కూడా!
నిన్నమొన్నటి అసెంబ్లీ సమావేశాల సందర్భంగా చోటు చేసుకున్న పరిణామాలు వైసీపీని కలవరపాటుకు గురి చేస్తున్నాయి. సభలో ఓ మహిళ జీవితాన్ని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు చాలా తప్పుడు సంకేతాలు అందిస్తున్నాయి. దీంతో వైసీపీ దిద్దుబాటుకు సిద్ధం అయింది. ఏదో ఒక విధంగా ఈ వివాదం నుంచి గట్టెక్కి పోవాలని భావిస్తోంది. దీంతో వైసీపీ నాయకులు కాస్త మెత్తబడ్డారు. విషయం చిలికి చిలికి గాలివానలా మారిపోవడంతో చంద్రబాబు వర్గం చేస్తున్న ప్రచారం ఇంకా పెరిగిపోతుండడంతో ఏం చేయాలో తోచక వైసీపీ చాలా మెట్లు దిగి వచ్చింది. అనుకూల మీడియా రాసిన విధంగానే టీడీపీ నడుచుకుంటుంది అని వైసీపీ విమర్శలు చేసినా, చంద్రబాబు భార్యను ఉద్దేశించి సభలో వినపడిన అనుచిత వ్యాఖ్యలు పలు వేదికలపై రాజకీయాలకు కారణం అవుతున్నాయి. ఇవన్నీ టీడీపీకి కలిసివచ్చే పరిణామాలే కావడం విశేషం. టీడీపీ నుంచి దృష్టి మరల్చేందుకు వైసీపీ డైవర్షన్ పాలిటిక్స్ ను ఎంచుకుంటోంది. అందుకే విభిన్న అంశాలను తెరపైకి తీసుకువచ్చి పబ్బం గడుపుకోవాలని ప్రయత్నిస్తోంది.