తెలంగాణ రాష్ట్రంలో క‌రోనా మ‌హమ్మారి మ‌ర‌ల క‌ల‌వ‌రానికి గురి చేస్తున్న‌ది. ఇటీవ‌ల కాలం నుంచి క్ర‌మ‌క్ర‌మంగా రోజు రోజు కు కేసులు పెర‌గ‌డంతో ఆందోళ‌న క‌లిగిస్తున్న‌ది. క‌రీంన‌గ‌ర్ జిల్లా లోని ఓ ప్ర‌యివేటు వైద్య క‌ళాశాలలో ఏకంగా 43 మంది వైద్య విద్యార్థుల‌కు పాజిటివ్ రావ‌డంతో వైద్య‌వ‌ర్గాల‌లో కాస్త ఆందోళ‌న క‌లిగిస్తోంది.  గ‌త నెల న‌వంబ‌ర్ 20న 134 నూత‌న కేసులు న‌మోదు కావ‌డంతో ఈనెల 1న 193 నిర్థార‌ణ‌య్యాయి. ఆ త‌రువాత మూడు రోజుల వ్య‌వధి కాలంలోనే ఈనెల 4న కేసుల సంఖ్య దాదాపు 200పైగా దాటింది. క్రియాశీల కేసులను  ప‌రిశీలించిన‌ట్ట‌యితే పాజిటివ్ కేసుల సంఖ్య వేగంగా పెరుగుతున్న‌ట్టు తెలుస్తున్న‌ది. గ‌త నెల 20న రాష్ట్రంలో 3,626 యాక్టివ్ కేసులు ఉంటే.. ఈ నెల 5న 3,787కు పెరిగాయి. కేవ‌లం రెండు వారాల కాలంలోనే 161 క్రియాశీల కేసులు పెరిగాయ‌ని గ‌ణాంకాలు వెల్ల‌డిస్తున్నాయి.

నిన్న కరీంనగర్‌ జిల్లా బొమ్మకల్‌ గ్రామంలోని చల్మెడ ఆనందరావు వైద్య కళాశాలలో 43 మంది విద్యార్థులు కరోనా బారిన పడ్డారు. తొలుత అనారోగ్యానికి  గుర‌యిన ఓ విద్యార్థికి వైద్య‌ పరీక్షలు నిర్వహించగా పాజిటివ్‌గా తేలిన‌ది. శని, ఆదివారాల్లో నిర్వహించిన క‌రోనా పరీక్షల్లో మరొక 43 మందికి వైరస్ నిర్థార‌ణ‌ అయినట్టు కళాశాల ఛైర్మన్‌ వెల్లడించారు. కరోనా కలకలంతో నిన్న సాయంత్రం నుంచి కళాశాలకు సెలవు ప్రకటించారు. గత ఆదివారం నిర్వహించిన కళాశాల వార్షికోత్సవంలో పాల్గొన్న విద్యార్థులకు ముఖ్యంగా ఒకరి నుంచి మరొకరికి క‌రోనా సోకినట్టు భావిస్తున్నారు.

రంగారెడ్డి జిల్లా బండ్లగూడ జాగీర్‌ నగర పాలక సంస్థ పరిధిలోని గిరిధారి ఎగ్జిక్యూటివ్ పార్క్‌ అపార్ట్‌మెంట్‌లో నిన్న 10మందికి పైగా  క‌రోనా బారిన ప‌డ్డారు. దీంతో అప్రమత్తమైన అధికార యంత్రాంగం స్థానికులు 161మందికి ర్యాపిడ్‌ టెస్టులను నిర్వహించారు. ఒమిక్రాన్‌ వేరియంట్ త‌రుణంలో రాష్ట్రంలో కేసులు పెరుగుతుండటంతో  వైద్యారోగ్యశాఖ తాజాగా అప్రమత్తమైన‌ది. ముఖ్యంగా  కరోనా నిబంధనలు కఠినతరం చేయడంతోపాటు ప్రజల‌లో అవగాహన కల్పిస్తున్నారు.

మంచిర్యాలలోని క‌ళాశాల రోడ్డులో గల మిమ్స్ హాస్టల్‌లో కరోనా కలకలం చెలరేగిన‌ది. మిమ్స్ కళాశాలలో ఇంటర్ చదువుతున్న విద్యార్థినికి గత  మూడు రోజులుగా  జ్వరం రాగా.. అనుమానంతో వైద్య పరీక్షలు చేయించ‌గా.. టెస్టుల్లో పాజిటివ్‌గా నిర్థార‌ణ కావ‌డంతో మిగతా విద్యార్థులంద‌రూ ఆందోళనకు గురవుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: