దీంతో వాసుదేవ్ ఒక స్వామీజీ మాట ప్రకారం విజయ్ను రాష్ట్ర ముఖ్యమంత్రి పదవిలో కూర్చోబెడతాడు. రాజకీయాల్లో ఏబీసీడీలు కూడా తెలియని విజయ్ ముఖ్యమంత్రి పదవిని తొలుత సీరియస్గా తీసుకోడు. సరదాగా స్నేహితులతో గడుపుతుంటాడు. ఇలాంటి సమయంలో అనుకోకుండా జరిగిన ఒక ఘటనతో విజయ్ మేల్కొంటాడు. జర్నలిస్టు (సత్యరాజ్) సాయంతో కొన్ని మంచి పనులు చేసి ప్రజల ఆదరాభిమానాన్ని చూరగొంటాడు. కొన్ని సందర్భాల్లో తన తండ్రినే వ్యతిరేకిస్తాడు. తన కొడుకును సీఎం పదవి నుంచి దింపడానికి నాజర్ శతవిధాలా ప్రయత్నిస్తాడు.
నాజర్ ఎత్తులను తట్టుకొని తన పదవిని కాపాడుకుంటాడు. మొత్తంమీద నోటా సినిమా కథ ఇది. ఈ సినిమాలో విజయ్ ఒక మంచి చేసి అనుకోకుండా రాష్ట్రానికి వచ్చిన ముప్పు నుంచి ప్రజల్ని కాపాడతాడు. ఈ సంఘటన అచ్చం రోశయ్య పాలనలో జరిగింది. రోశయ్య 2009 సెప్టెంబరు 9న ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఆయన సీఎం పదవి ఎక్కిన నెల రోజుల్లోనే రాష్ట్రానికి వరదల రూపంలో ఒక ముప్పు ఏర్పడింది. కృష్ణానదికి కనీవినీ ఎరుగని రీతిలో వరదలు వచ్చాయి. వేలాది గ్రామాలు నీట మునిగాయి. అపారమైన ఆస్తి నష్టం, ప్రాణ నష్టం జరిగింది.
శ్రీశైలం ప్రాజెక్టులోకి లక్షల క్యూసెక్కుల నీరు పోటెత్తింది. ఒక దశలో ప్రాజెక్టు కొట్టుకుపోతుందేమో అనే సందేహాలు కూడా వ్యక్తమయ్యాయి. కర్నూలు, మహబూబ్నగర్, గుంటూరు, నల్లగొండ జిల్లాలను వరద చుట్టుముట్టింది. ఈ విపత్కర పరిస్థితుల్లో ముఖ్యమంత్రి రోశయ్య రంగంలోకి దిగారు. అక్టోబరు 2, 3 తేదీల్లో పూర్తిగా సచివాలయంలోనే బస చేసి.. అధికారులతో సమీక్షించి సమస్య తీవ్రతను తగ్గించారు. ఇలా రెండు రోజులు సచివాలయంలోనే బస చేసి ఇతర రాజకీయ నాయకులకు ఆదర్శంగా నిలిచారు.