అరిస్తే వినరు చెప్పండి కాస్త ప్రశాంతంగా
కోపం వచ్చి ఊగిపోతే వినరు కాస్త తగ్గి ఉండండి
ఎందుకయినా మంచిది అన్నది ఏపీ సర్కారు వాదన
డబ్బుల్లేని సర్కారుకు కొత్త ఇబ్బంది వచ్చింది. 13 లక్షల ఓట్లు వైసీపీకి పడకుండా పోవడమే కాకుండా వచ్చే ఎన్నికల్లో ఆ పార్టీ అడ్రస్ ను సైతం గల్లంతు చేయడం ఏమంత కష్టం కాదని ఉద్యోగ సంఘాల జేఏసీ చైర్మన్ (అమరావతి) బొప్పరాజు బీరాలు పలుకుతున్నారు. వీటికి తాను భయపడనని ఎప్పుడో ప్రభుత్వ పెద్ద సజ్జల చెప్పారు. ఇలాంటి మాటలు వల్లనో చేతల వల్లనో పనులు కావని, ఉద్యోగులు అన్ని ప్రభుత్వాల్లోనూ కీలకం అని, ఆ సంగతి గుర్తెరిగి తాము ప్రవర్తిస్తున్నామని ఆయన వివరణ ఇస్తున్నారు. ఇంతగా చెప్పినా ఆర్థిక అధోగతిలో ఉందని వివరిస్తూ ఉన్నా కూడా ఉద్యోగులు తగ్గేదేలే అని అంటూ ఉద్యమ కార్యాచరణకు తుది రూపు ఇవ్వనున్నారు. జగన్ మాత్రం ఇవన్నీ విని చూసి లైట్ తీసుకుంటున్నారు.
వివిధ యూనియన్
లీడర్లు అంతా ఇప్పటికిప్పుడు పొలిటికల్
మైలేజీ కోరుకుంటున్నారు ఇదెంత మాత్రం
భావ్యం కాదు.. కాస్త ఆగండి ఏం కాదు
ఏపీ సర్కారుకు, ఉద్యోగ సంఘాలకు వివాదం నడుస్తోంది. ఎవరు ఏం చెప్పినా, ఎన్ని చెప్పినా వినేలా లేమని ఉద్యోగ సంఘాలు తెగేసి చెబుతున్నాయి. బండి శ్రీను అనే ఎంప్లాయీస్ యూనియన్ లీడర్, బొప్పరాజు వెంకటేశ్వర్లు అనే ఎంప్లాయీస్ యూనియన్ లీడర్ నేతృత్వంలో ఇవాళ్టి నుంచి నిరసనలకు సై అంటున్నారు. తమ గోడు వినకుంటే, ప్రభుత్వాలనే కూల్చేయగల దమ్ము తమ కు ఉందని అంటున్నారు. మరోవైపు అదే ఉద్యోగ వర్గాల్లో కొందరు జగన్ జగమొండి అని, నొప్పించే విధంగా కాకుండా మెప్పించే విధంగా నడుచుకుంటే ఆయన కాస్తో కూస్తో కరుణిస్తారని అంటున్నారు. ఇది విని తాము ఎవరి మోచేతి నీళ్లూ తాగేందుకు సిద్ధంగా లేమని ఉద్యోగ సంఘాలు అంటున్నాయి. ఈ తరుణంలో తాడో పేడో తేల్చుకుంటామని తాము గతంలో చంద్రబాబు సర్కారుకూ ఇదే విధంగా వార్నింగులు ఇచ్చి దారికి తెచ్చుకున్నామని, ఆ రోజు పాదయాత్రలో సీపీఎస్ రద్దుకు జగన్ హామీ ఇస్తేనే తాము పోస్టల్ బ్యాలెట్ ద్వారా మద్దతు ఇచ్చామని ఇవన్నీ మరిచిపోయి ప్రవర్తించడం తగదని బొప్పరాజు నీతులు లేదా హితవు చెబుతున్నారు.