తాజా పరిస్థితి చూస్తుంటే ఆందోళన విరమించే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. తమ భవిష్యత్ కార్యాచరణపై సంయుక్త కిసాన్ మోర్చా ఈరోజు కీలక ప్రకటన చేయనున్నది. రైతు సమస్యలపై రైతు సంఘాలు లేవనెత్తిన దాదాపు అన్ని డిమాండ్లను కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించినదని.. మున్ముందు లేవనెత్తాల్సిన సమస్యలు, ఆందోళనపై రైతు సంఘాల మధ్య ఏకాభిప్రాయం కుదిరిందని రైతు సంఘం నేత కుల్వంత్ సింగ్ వెల్లడించారు. ఈ మేరకు ఇవాళ ఎస్కేఎం ప్రకటన చేసే అవకాశం కనిపిస్తున్నది. ఇప్పటికే వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకున్న కేంద్రం.. తాము లేవనెత్తిన దాదాపు అన్ని డిమాండ్ల పరిష్కారంపై సానుకూలంగానే ఉన్నదని, దానిపై కేంద్ర ప్రభుత్వం నుంచి లేఖ రాకేశ్ టికాయత్కు లేఖ కూడా వచ్చిందని చెబుతున్నారు రైతు సంఘాల నేతలు.
40 రైతు సంఘాలతో కూడిన ఎస్కేఎం ప్రతినిధులు నిన్న మంగళవారం భేటీ అయ్యారు. రైతు సంఘాల ప్రతినిధులతో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా మాట్లాడి.. కమిటీ ఏర్పాటు చేసుకోవాలని సూచించిన తరుణంలో జరిగిన సమావేశంతో దాదాపు అన్ని అంశాలు చర్చకు వచ్చాయి. సుదీర్ఘ కాలంగా కొనసాగుతున్న ఆందోళనను విరమించాలంటూ కేంద్రం చేసిన ప్రతిపాదనపై కూడా చర్చించినట్టు తెలుస్తోంది. ఇక రైతు సమస్యల పరిష్కారంపై కేంద్రం సానుకూలత వ్యక్తం చేస్తుండడంతో ఆందోళలకు ముగింపు పలికే అవకాశాలు కనిపిస్తున్నాయని ఎస్కేఎం నేతలు పేర్కొంటున్నారు. భారత్ కిసాన్ దీనిపై యూనియన్ రాకేష్ టికాయత్ కూడా క్లారిటీ ఇచ్చారు. ఆందోళన విరమణపై తుది నిర్ణయం బుధవారం తీసుకుంటామని ప్రకటించారు. మొత్తానికి ఇవాళ రైతులు ఆందోళన విరమణపై ఓ కీలక ప్రకటన చేసే అవకాశం ఉందని పేర్కొంటున్నారు.