మద్యం తాగు మనీ ప్రోత్సహించడం తాగిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత పోలీసులు పరీక్షించి జరిమానాలు విధించడం దేనికి సంకేతం..? ఈ రకంగా సామాన్య ప్రజానీకం జరిమానాల పేరుతో కోట్లాది రూపాయలు ప్రభుత్వానికి చెల్లించడం ఒకవైపు జరుగుతున్నది. మరొకవైపు ఆకతాయిలు, యువత, తాగుబోతుల చేతిలో అనేక మంది అమాయకులు రోడ్డు ప్రమాదంలో బలైపోతున్నారు .ఈ రెండింటిని నివారించడం కోసం బార్లు రెస్టారెంట్లను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే మూసివేయాలి. ఎవరైనా ఇష్టపడే వారు ఉంటే మద్యం షాపులు మాత్రమే తెరిచి ఉంటే ఇంటికి తీసుకొని వెళ్ళవచ్చు .ఆ విధానాన్ని గనుక ప్రకటిస్తే రోడ్డు మీద ఎన్నో దుర్మార్గాలు, ప్రమాదాలు, ఆగడాలకు కళ్లెం వేయవచ్చు. ప్రధానంగా హైదరాబాద్ లో నిన్న జరిగినటువంటి అనేకరోడ్డు ప్రమాదాల లో ఎందరో ప్రాణాలు కోల్పోకుండా ఉండడానికి కొనుగోలు చేసి ఇంటివద్దనే తాగే విధానాన్ని కనుక నిర్బంధంగా అమలు చేస్తే బార్లను రెస్టారెంట్లను మూసివేసి పకడ్బందీగా చర్యలకు శ్రీకారం చుడితే ఈ అకృత్యాలకు అడ్డుకట్ట వేయవచ్చు.
గతంలో మద్యం షాపులు తక్కువగా ఉండేవి .బార్లు రెస్టారెంట్లు సంఖ్య కూడా పరిమితంగా ఉండటం వల్ల ఇలాంటి ప్రమాదాలు, పరిణామాలు ఆనాడు ఎక్కువగా జరగలేదు. మరింత కట్టడి చేయడం ద్వారా ప్రమాదాలు ఆగడాల సంఖ్యను గణనీయంగా తగ్గించడానికి పరిమిత సమయం లోపల దుకాణాలను కొనసాగించడం మాత్రమే తక్షణ పరిష్కారం. లేకుంటే రోడ్డు ప్రమాదాల్లో వేలాది మంది చనిపోతే కుటుంబాలు చిన్నాభిన్నం అవుతుంటే ఆ పాపానికి రాష్ట్రప్రభుత్వానికి బాధితుల ఉసురు తగలక తప్పదు.
ఈ అంశం ప్రజలందరికీ సంబంధించినదే అయినప్పటికీ ఈ విషయం లోపల బుద్ధి జీవులు, మేధావులు, విద్యావంతులు, ముఖ్యంగా యువత కూడా స్పందించిన దాఖలాలు లేవు. కేవలం వ్యక్తిగత స్వార్థం కోసం, తమసౌఖ్యం కోసం, క్షణకాలపు ఆనందం కోసం ప్రభుత్వాలు కల్పిస్తున్న విచ్చలవిడి సౌకర్యాల పట్ల ప్రతిఘటన లేని కారణంగా ప్రభుత్వం మరింత దూసుకుపోతున్నది .ప్రభుత్వ చర్యలకు కట్టడి చేయాలంటే ముఖ్యంగా యువత ముందు వరుసలో ఉండి పోరాటం చేస్తే తప్ప సాధ్యం కాదు. "మా ఆరోగ్యం మా చేతుల్లో" అని నినదిస్తూ మా ఆరోగ్యాన్ని పాడు చేసే అధికారం మీకు లేదని ప్రభుత్వాన్ని హెచ్చరించగలిగితే మద్యపానము దుష్పరిణామాలను అడ్డుకోవచ్చు. ప్రశాంతమైన, ఆరోగ్యకరమైన, భద్రత కలిగిన జీవితానికి పునాది వేయవచ్చు. ప్రజలు ,ప్రజాస్వామిక వాదులు, విద్యావంతులు, బుద్ధిజీవులు ఈ విషయం పట్ల ఆలోచించి ఎక్కడికక్కడ ప్రజలను చైతన్యవంతులను చేయవలసిందిగా విజ్ఞప్తి.