కోదాడ మున్సిపాలిటీ కౌన్సిల్ ఏర్పడిన తర్వాత కరోనా వల్ల పాలకవర్గాల మీటింగులు జరగలేదు. దీంతో ఎమ్మెల్యే మల్లయ్య యాదవ్ ... మున్సిపల్ అధికారులతో నేరుగా మాట్లాడేసి పట్టణ పరిధిలో ఏయే పనులు చేపట్టాలో ఆదేశాలు ఇచ్చేవారట. అయితే వీరిద్దరి మధ్య ఎక్కడ తేడా కొట్టిందో ఏమో గాని ఆరు నెలలుగా వీరిద్దరి మధ్య ఏ మాత్రం పొసగటం లేదని అంటున్నారు. దీంతో కోదాడ నియోజకవర్గంలో టిఆర్ఎస్ పార్టీ రెండు గ్రూపులుగా విడిపోయిందని అంటున్నారు.
శిరీష మున్సిపల్ చైర్ పర్సన్ గా ఉన్నా కూడా పెత్తనం మొత్తం ఆమె భర్త లక్ష్మీనారాయణ చేస్తున్నారు. దీనిపై టిఆర్ఎస్ కౌన్సిలర్లు కూడా గతంలో అనేకసార్లు ఆరోపణలు చేశారు. ఎమ్మెల్యే వర్గీయులు లక్ష్మీనారాయణ కేంద్రంగా అవినీతి ఆరోపణలు చేస్తున్నారు. మున్సిపాలిటీలో ఔట్ సోర్సింగ్ విభాగంలో నియమించిన ఉద్యోగాలకు డబ్బులు వసూలు చేసినట్లు ఆరోపణలు రావడంతో ఎమ్మెల్యే ఆగ్రహంతో ఉన్నట్టు తెలుస్తోంది.
ఈ క్రమంలోనే చైర్పర్సన్ పై అవిశ్వాస తీర్మానం పెట్టి శిరీష ను పదవి నుంచి దింపేసేందుకు ఎమ్మెల్యే ప్లాన్ చేస్తున్నట్టు నియోజకవర్గంలో ప్రచారం జరుగుతోంది. ఏదేమైనా కోదాడలో అధికార పార్టీ రెండు ముక్కలుగా చీలిపోవడంతో కేడర్ ఆందోళనలో ఉంది.