ఆంధ్రావనిలో పల్లెలు సంక్రాంతికి ముస్తాబవుతున్నాయి.కొత్త కాంతులు నింపుకుంటున్నాయి.పల్లె అంటే ధాన్యం ఇంటికి వచ్చే వేళ లక్ష్మీదేవికి పూజ చేసే ఓ గొప్ప సంస్కృతికి ఆనవాలు అని అర్థం.పల్లె అంటే ఉన్నా లేకున్నా నలుగురి క్షేమం కోరి ఉన్నంతలో భూదేవిని నమ్ముకుని బతకడం..స్థితిమంతులు కాకపోయినా పర్లేదు కానీ దారి తప్పే మనుషులు మాత్రం కాబోము అని చెప్పే సంస్కృతికి నిలువుటద్దం.. ఇన్ని ఉన్న పల్లెలు..ఎన్నో ఏళ్ల నాటి పల్లెలు..మన చిన్న నాటి గుర్తులు ఇవన్నీ ఏమౌతున్నాయి?
కానీ ఈ వేళ పల్లెలు కట్టుతప్పుతున్నాయి..పల్లెలు దారి తప్పి ప్రయాణిస్తున్నాయి..విష సంస్కృతి నీడల్లో పల్లెలున్నాయి.. పల్లెలకు బాగు కోరే వారు లేరు.. పల్లెలలను ఎల్లలు చెరిపి బాగు చేసే వారు కూడా లేరు. పల్లెలు ఇదివరకటిలా లేవు అని అనేందుకు కూడా కొన్ని కారణాలు ఉన్నాయి. అవేంటంటే.. ప్రభుత్వాల తీరు కారణంగా పక్క ఊళ్ల నుంచి పక్క ప్రాంతాల నుంచి నాటు సారా విపరీతంగా దిగుమతి అయిపోతుంది.. అక్రమ తరలింపు యథేచ్ఛగా సాగిపోతోంది.పోలీసుల కనుసన్నల్లోనే ఇదంతా జరిగినా కూడా ఒకప్పటిలా వీటిపై మీడియా కూడా పెద్దగా దృష్టి సారించలేకపోతోంది. పండుగ వస్తుందంటే చాలు తాగడం తూగడం వాగడం అన్న పద్ధతుల్లోనే పల్లె జనం ఉన్నారు. ఇది సీదిరి అప్పల్రాజు నియోజకవర్గం అని చెప్పుకునేందుకో మంత్రి ఇలాకా అని రాసుకునేందుకో కాదు అన్నింటా తగువులు ఇలానే ఉన్నాయి. సాక్షాత్తూ ఎక్సైజ్ శాఖ మంత్రి ఉన్న ఊళ్లో కూడా ఇలానే ఉంటుంది. అందుకు చిత్తూరు మినహాయింపు కాదు అందుకు శ్రీకాకుళం మినహాయింపు కాదు.