కంటి మీద కునుకులేకుండా పంటలు కాపాడుకున్న రైతుకు మళ్లీ అకాల వాన ఉరుకులు పెట్టిస్తోంది.పంట సాగు విషయమై తమకు మిగిలిందేమీ లేదని,ప్రభుత్వం పూర్తి స్థాయిలో ధాన్యం కొనుగోలు అన్నది చేపట్టకపోగా..దళారీ వ్యవస్థతో తాము ఎప్పటిలానే దగా పడ్డామని అంటూ ఉత్తరాంధ్ర రైతులు గగ్గోలు పెడుతున్నారు.ఇప్పటికే మూడు సార్లు తీవ్ర తుఫానుల రాక కారణంగా గడిచిన రెండు,మూడేళ్లలో ఉత్తరాంధ్ర రైతులు తీవ్రంగా నష్టపోయి ఏమీ లేకుండా మిగిలామని అంటున్నారు. ఇప్పుడు కాస్తో కూస్తో పంట చేతికి వచ్చిందనుకుంటున్న తరుణాన వాతావరణం అందుకు అనుకూలంగా లేదనే సమాచారం అందుతోందని వేదన చెందుతున్నారు. బోలెడు అప్పులు చేసి పంటలు పండించి ఏదో ఒక విధంగా ఒడ్డున పడ్డాం అనుకుంటున్న తమకు ఈ వాన మళ్లీ కన్నీటిని మిగులుస్తుందా అని ప్రశ్నిస్తున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆకస్మికంగా వాన పడితే తమ గతేం కావాలని కన్నీటి పర్యంతం అవుతున్నారు.వీరంతా ధాన్యం కాపాడుకునేందుకు టార్పాన్ల కోసం పరుగులు తీస్తున్నారు.
వాతావరణంలో మార్పులివి....
వాతావరణంలో వచ్చిన అనూహ్య మార్పుల కారణంగా ఈ రోజు గుంటూరు, కృష్ణా, ఉభయ గోదావరి, విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం, తూర్పు తెలంగాణ జిల్లాల్లో ఎక్కువ వర్షాలు పడడంతో పాటు పిడుగులు పడడం, ఈదురుగాలులు వీయడం వంటివి ఉంటాయి. గత 30 సంవత్సరాల్లో జనవరి నెలలో ఎన్నడూ వర్షాలు నమోదయ్యిండవు. కొన్ని చోట్ల అతిభారీ వర్షాలు ఉండే అవకాశాలున్నాయి. రైతులు జాగ్రత్తపడండి. కర్నూలు తూర్పు, కడప ఉత్తర భాగం, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు కురిసే వీలుంది.
- వెదర్ మెన్, ఆంధ్రప్రదేశ్