పంజాబ్ లో జెండా ఎగరేయాలని ప్రయత్నిస్తున్న ఆప్ అధ్యక్షడు, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ప్రజలకు బంపరాఫర్ ఇచ్చారు. తొందరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ గెలుస్తుందని అందరు అనుకుంటున్నారు. ఇప్పటివరకు జరిగిన అన్నీ ప్రీపోల్ సర్వేలన్నీ ఆప్ దే విజయమని తేల్చిచెప్పాయి. ఈ నేపధ్యంలోనే పంజాబ్ ప్రజలకు కేజ్రీవాల్ బంపరాఫర్ ఇచ్చారు. అదేమిటంటే ఆప్ తరపున ముఖ్యమంత్రిగా ఎవరైతే బాగుంటుందనే విషయాన్ని ఎస్ఎంఎస్, వాట్సప్ ద్వారా ప్రతిపాదించమన్నారు.
ఇందుకోసం 7074870748 అనే ఫోన్ నెంబర్ ను కూడా ప్రకటించారు. పంజాబ్ లోని మూడు కోట్లమంది ప్రజల ఆలోచనలు, అభిప్రాయాలకు అనుగుణంగా నిర్ణయం తీసుకోవాలని డిసైడ్ అయినట్లు కేజ్రీవాల్ చెప్పారు. తమ అభిప్రాయం చెప్పేందుకు జనవరి 17వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు సమయం ఇచ్చారు. ప్రజల అభిప్రాయాల ద్వారా ముఖ్యమంత్రిని ఎంపిక చేయటం బహుశా దేశంలోనే ఇదే మొదటిసారి కావచ్చు.
మామూలుగా అయితే ఒక పార్టీ తరపున ఎంపికైన ఎంఎల్ఏలు ముఖ్యమంత్రి అభ్యర్ధిని ఎంపిక చేసుకుంటారు. జాతీయ పార్టీల్లో అయితే ఈ ప్రక్రియ మరింత సుదీర్ఘంగా సాగుతుంది. నిజానికి ఆప్ అధికారంలోకి వస్తే ఎంపి భగవత్ మాన్ను ఎంపిక చేస్తారనే ప్రచారం జరుగుతోంది. అయితే భగవంతే తనకు ప్రజాభిప్రాయం ద్వారా ముఖ్యమంత్రిని ఎంపిక చేయాలనే ప్రతిపాదన చేసినట్లు చెప్పారు.
అంతా బాగానే ఉందికానీ ఇక్కడే ఒక అనుమానం మొదలైంది. పంజాబ్ ఎన్నికల్లో ఇంతవరకు ఆప్ అభ్యర్ధులను ప్రకటించలేదు. ఆప్ తరపున పోటీచేసేవారిలో ఎవరు గెలుస్తారో కూడా ఇప్పుడే ఎవరు చెప్పలేరు. ఒకపార్టీ తరపున ముఖ్యమంత్రిగా ప్రొజెక్టయిన నేతలు ఎన్నికల్లో ఓడిపోయిన ఘటనలు ఉన్నాయి. కాబట్టి కేజ్రీవాల్ ఇపుడు చెప్పిన విషయం అంత సబబుగా లేదు. అందరు అభ్యర్ధులను ప్రకటించిన తర్వాత ఈ బంపరాఫర్ ఇచ్చుంటే బాగుండేది. ఎంఎల్ఏ అభ్యర్థులు ఎవరో తెలీకుండా ప్రజలు ముఖ్యమంత్రి అభ్యర్ధిని ఎలా ఎన్నుకుంటారు ?