తిరుమలలో కోవిడ్ నిబంధనలు సామాన్య భక్తులకేనా..? వీఐపీలకు లేని ఆంక్షలు వారికే ఎందుకు..? అఖండ కోటికి బ్రహ్మాండ నాయకుడైన ఏడుకొండల స్వామి దర్శనం కోసం ఎన్ని ప్రయాసలు ఎదురైనా ఆనందంగా భరిస్తారు భక్తులు. అందుకే సామాన్య భక్తులకు ఎలాంటి ప్రణాళికలు, సిఫారస్ లు ఉండవు. తమను గట్టెక్కించే స్వామి వారు గుర్తొస్తే చాలు తిరుమలకు వచ్చేస్తారు. స్వామివారిని దర్శించుకుని ఆ సమయంలో కలిగే దివ్యానుభూతితో తిరుగు ప్రయాణం అవుతారు భక్తులు.

కానీ ఏడాదిన్నర కాలంగా సామాన్య భక్తులకు శ్రీవారు దూరం. ఈ మాట అనేకంటే టీటీడీనే అంచలంచలుగా దూరం చేస్తోందా అనే సందేహాలు కలుగుతున్నాయి. శ్రీవారి దర్శనానికి విచ్చేసే భక్తుల్లో 60 నుంచి 70 శాతం సామాన్యులే. కోవిడ్ ఆంక్షల పేరుతో కనీసం ఆరు శాతం సామాన్యులు కూడా శ్రీవారిని దర్శించుకోవడం లేదు. కోవిడ్ మొదలైనప్పటి నుంచి శ్రీవారి దర్శనాల నియంత్రణ కొనసాగుతోంది. ఈ ఆంక్షలు  కూడా ఒక వైపే అన్నట్టుగా మారిపోయింది. ప్రస్తుతం 30 నుంచి 40 వేల మంది భక్తులను దర్శనానికి అనుమతిస్తున్న అవన్నీ ఆన్లైన్లోనే కేటాయిస్తున్నవి. సర్వ దర్శనం టోకెన్లు ఇస్తున్నా, అవి సామాన్యులకు ఆమడ దూరంలోనే ఉన్నాయి. ఆన్లైన్లో సంపన్నులతో పోటీపడి దర్శనం టిక్కెట్లు పొందే సామర్థ్యం సామాన్యులకు లేదనే వాదన ఉంది. ఆఫ్లైన్లో సామాన్య భక్తులకు అందుబాటులో ఉండేలా సర్వ దర్శనం టోకెన్లు జారీ చేయాలి అంటే మాత్రం కోవిడ్ అడ్డస్తుందట. కరోనా ఆంక్షలు పాటించాల్సి ఉన్నా వాటిని సామాన్య భక్తులకే వర్తింప చేయడంపై ప్రశ్నలు వినిపిస్తున్నాయి. తిరుమలలో రోజు సిఫారసు లేఖల పై విఐపి బ్రేక్ దర్శనాలను ఆఫ్లైన్ లో జారీ చేస్తున్నారు. వాటిపై నియంత్రణ లేదు. టికెట్ల సంఖ్య తగ్గించడం లేదు. ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను పూర్తిగా ఆన్లైన్లో కేటాయిస్తున్నా, గతంతో పోలిస్తే వీటి సంఖ్య కూడా గణనీయంగా పెరిగింది. గతంలో రోజుకు 18 నుంచి 20 వేల టిక్కెట్లు జారీ చేయగా, ప్రస్తుతం 20 నుంచి 25 వేల వరకు ఉంటుంది. సమస్యంతా సామాన్య భక్తులదే అన్నట్టుగా వారి సంఖ్యను టిటిడి పూర్తిగా కట్టడి చేసింది. గతంలో రోజుకు 30 నుంచి 50 వేల మంది సామాన్య భక్తులు శ్రీవారిని దర్శించుకునేవారు. ప్రస్తుతం సామాన్యులకు ఇస్తున్న టోకెన్లు 10 వేలే. అది ఆన్లైన్లోనే అందిస్తుంది టీటీడీ. సామాన్య భక్తులకు తిరుపతిలో దర్శనం టోకెన్లు జారీ చేస్తే వాటిని పొందే క్రమంలో కోవిడ్ వ్యాప్తి చెందుతుందని టీటీడీ వెళ్ళిపోతుంది. అయితే విఐపి  టికెట్ల కోసం ఎంబీసీ వద్ద నిత్యం భక్తులు గుమిగూడినప్పుడు కానీ, వాళ్లంతా దర్శనానికి వెళ్లే సమయంలో కానీ కరోనా ప్రబలదట. ఎందుకో టీటీడీనే చెప్పాలి.

 వైకుంఠ ఏకాదశి రోజున వీవీఐపీల పేరుతో జరిగిన హడావిడి కానీ, వాళ్లంతా దర్శనానికి వెళ్లే సమయంలో కానీ ఎక్కడా కోవిడ్ నిబంధనలు పాటించలేదు. ఆంక్షలు అమలవుతున్నాయో లేదో పట్టించుకోలేదు. అదే సామాన్య భక్తుల దగ్గరికి వచ్చేసరికి నిబంధనల కొరడా ఝలిపిస్తున్నారు. కొండపై సామాన్యులకే ప్రాధాన్యం అనే మాటను, మాటలకే పరిమితం చేసి పెద్దలను ఒకలా, సాధారణ భక్తులను మరోలా చూడటమే విమర్శలకు తావిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: