ఇవాళ ఎన్టీఆర్ వర్ధంతి.26వ వర్ధంతి.ఆయన వినిపించిన ఆత్మగౌరవ నినాదం కారణంగా ఎందరెందరో నాయకులు వెలుగులోకి వచ్చారు అన్నది ఓ వాస్తవం.ప్రాంతీయ పార్టీల గ్రాఫ్ ను మార్చింది కూడా ఆయనే! ప్రాంతీయ పార్టీల హవాను జాతీయ స్థాయికి తెలియజేసిన ఏకైక ధీశాలి కూడా ఆయనే! ఆయన తరువాత చాలా మంది ఆత్మగౌరవ నినాదం అందుకుని సక్సెస్ అయ్యారు. ఇవాళ తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులుగా ఉన్న జగన్ కానీ కేసీఆర్ కానీ ఒకనాడు ఆత్మగౌరవ నినాదాన్ని వినిపించిన వారే. అదేవిధంగా పవన్ కల్యాణ్ కూడా ఆత్మగౌరవ నినాదాన్ని అందుకున్న వారే! ప్రజారాజ్యం స్థాపనతో రాజకీయ అరంగేట్రం చేసిన చిరంజీవి కూడా ఆత్మగౌరవ నినాదాన్ని వినిపించిన వారే! వీరందరికీ ఎన్టీఆరే ఆదర్శం.ఎలానో చూద్దాం..
ముఖ్యంగా ఢిల్లీ పెద్దలను ఎదురించడంలో ఆ రోజు వైఎస్ కూడా గొప్పనైన సాహసం చూపించారు.కొన్ని సందర్భాల్లో తన మాటకు ఎదురేలేదని నిరూపించారు.ఆ విధంగా ఎన్టీఆర్ ను ఆదర్శంగా తీసుకునే ఢిల్లీ పెద్దలను ఎదిరించారు అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు.ఆ తరువాత ఆయన కుమారుడు అనూహ్య రీతిలో ఒంటరి అయిపోయారు.వైఎస్ మరణానంతర పరిణామాల్లో ఆత్మ గౌరవ నినాదాన్ని వినిపించి కాంగ్రెస్ పార్టీ అధిష్టానాన్ని ఎదిరించి తరువాత కాలంలో నిలదొక్కుకుని ముఖ్యమంత్రి అయ్యారు. ఆ విధంగా ఆయన ఎదుగుదలకు పరోక్షంగా ఎంతో కారణం అయ్యారు ఎన్టీఆర్.
ఆత్మ గౌరవ నినాదం వినిపించే క్రమంలో కొంచెం బాగానే రాణించాలని భావించిన వారిలో ఇంకొందరు ఉన్నారు.వారే కేసీఆర్. ఆయన తెలంగాణ ఉద్యమ సారథి.ఇవాళ తిరుగులేని నేత.అంతేకాదు ఒకనాడు ఎన్టీఆర్ పార్టీలో క్రియాశీలకంగా ఉన్న నేత కూడా! ఓ సందర్భంలో ప్రత్యేక ఉద్యమాల కాలంలోనూ తరువాత కూడా కేసీఆర్ ఆత్మగౌరవ నినాదాన్ని వినిపించారు. విజయవంతం అయ్యారు.ఇక ఆత్మగౌరవ నినాదం వినిపించిన వారిలో చిరంజీవి కూడా ఉన్నారు.ప్రజా రాజ్యం స్థాపనలో ఆయన ఆ రోజు వినిపించిన నినాదం ఆంధ్రులను విపరీతంగా ఆకట్టుకుంది.నేరుగా కాకపోయినా కొన్నింట ఈ నినాదం ఓ శ్రీరామ రక్ష అయి నిలిచి ఉంది.