ఎన్టీఆర్ అంటే మూడక్షరాల ఆవేశం
మూడక్షరాలలో ఒదిగిన గౌరవం కూడా!
ఇవాళ ఆయన వర్ధంతి.. స్మరణలో భాగంగా
కొన్ని విషయాలు..
(రత్నకిశోర్ శంభుమహంతి)
అమ్మ అంటే మాకు బసవతారకమే మరో అమ్మ మాకు లేరు..రారు కూడా అని ఆరోజు ఎన్టీఆర్ బిడ్డలు వినిపించిన స్వరం ఇప్పటికీ గుర్తు.ఆ విధంగా ఆ తల్లి స్మరణలోనే బాలయ్య,పురంధరి ఉంటారే తప్ప ఎల్పీ జోలికి పోరు.ఆమె వారి గురించి మాట్లాడినా కూడా పట్టించుకోరు.వినిపించుకోరు.ఇక ఏటా వినిపించే నినాదాలు ఈ ఏడు వినిపించకపోవడంలో ఆశ్చర్యం లేదు. కానీ మారిన పరిణామాలు మనుషులను మార్చాయి అని మాత్రం చెప్పవచ్చు.ఇక ఆ రోజు కొన్ని కారణాల రీత్యా ఎన్టీఆర్ కు పూర్తిగా దూరం అయిపోయిన పిల్లలు..తరువాత కాలంలో నాన్న స్మరణలో ఉండడం కూడా ఓ మంచి పరిణామమే! అదేవిధంగా ఎల్పీ తాను ఎన్టీఆర్ ఆత్మతో మాట్లాడానని చెప్పినా,బాలయ్య తన అమ్మ గారి పేరిట కట్టిన ఆలయానికి సేవ చేసుకుంటానని (బసవ తారకం క్యాన్సర్ ఆస్పత్రి) అని చెప్పినా...కాలం తెచ్చిన మార్పులో భాగంగానే చూడాలి..పరిగణించాలి కూడా! అన్నట్లు.. విన్నట్లు ఎల్పీ అనగా లక్ష్మీ పార్వతి అని అర్థం.
ఎన్టీఆర్ కు భారత రత్న ఇవ్వాల్సిందే..ఏటా వినిపించే డిమాండ్ ఈ ఏడాది ఈ 26వ వర్ధంతి వేళ వినిపించకుండా పోయింది. అవును! ఇవాళ ఎందుకనో ఆ నినాదాన్ని ఆయన కుటుంబ సభ్యులెవ్వరూ పెద్దగా వినిపించలేదు అనే తెలుస్తోంది.ఒకవేళ వినిపించినా ఇప్పట్లో ఆ ప్రతిపాదనకు కార్యరూపం అన్నది రానేరాదు.కనుక భారత రత్న అన్నది ఎన్టీఆర్ విషయమై ఓ ఔట్ ఆఫ్ ద బాక్స్..అది తప్ప ఇంకేమయినా కోరుకోవాలి.ఇంకేమయినా చేరుకోవాలి.వాస్తవానికి కృష్ణా జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెడతామని అప్పట్లో చంద్రబాబు చెప్పారని గుర్తు. (కృష్ణా జిల్లా అంటే ఎన్టీఆర్ నడయాడిన నేల అని అర్థం)
చంద్రబాబు చెప్పారో జగన్ చెప్పారో కానీ మొత్తమ్మీద ఆ ప్రతిపాదన కూడా ఒడ్డెక్కలేదు.కార్యరూపం దాల్చలేదు.దీంతో అంతా ఆ విషయమే మరిచిపోయారు.కడప జిల్లాకు వైఎస్ పేరు పెట్టినంత వేగంగా కృష్ణా జిల్లాకు ఎన్టీఆర్ పేరు ఎందుకు పెట్టడం లేదో కూడా ఇవాళ్టికీ అంతు చిక్కని మేటర్ (ఆర్) సబ్జెక్ట్.ఏ మాటకు ఆ మాట ఎన్టీఆర్ ను సొంతం చేసుకునేందుకు ఆయన పేరు పై పేటెంట్ సాధించేందుకు అటు టీడీపీ ఇటు వైసీపీ ఎప్పుడూ ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాయి.
వైసీపీ ఎలా అంటే ఆయన జీవన సహచరి లక్ష్మీ పార్వతిని అడ్డం పెట్టుకుని,రాజకీయం చేసి చంద్రబాబుపై వ్యతిరేకంగా మాట్లాడించి సానుభూతి రాజకీయం ఒకటి ఎప్పటి నుంచో నడుపుతోంది.ఆ విధంగా ఎన్టీఆర్ పై పేటెంట్ తెచ్చుకునేందుకు వైసీపీ బాగానే ప్రయత్నించింది.ఇక టీడీపీ లో కూడా కొందరు..నందమూరి తారక రామారావు అంటే ఎవరో తెలియని వారు కూడా..
జై ఎన్టీఆర్ అని ఇవాళ్టికీ అంటుండడమే విడ్డూరం.ఏ విధంగా చూసుకున్నా భారత రత్న అవార్డుకు అర్హత పొందినా, పొందకపోయినా పార్లమెంట్ ప్రాంగణంలో మాత్రం ఎన్నో పోరాటాల తరువాత కాంగ్రెస్ హయాంలో పురంధరి నేతృత్వంలోనే ఎన్టీఆర్ విగ్రహ ఏర్పాటు మాత్రం నిజంగానే అభినందించదగ్గ పరిణామం.ఆ పని సాధించి పెట్టింది మాత్రం కొడుకులు కాదు..అల్లుళ్లు కాదు ..కూతురు మాత్రమే అని గర్వంగా చెప్పుకోవచ్చు తెలుగు వారందరూ! దటీజ్ పురంధరి!