ఆకుపచ్చని చందమామ మాత్రం కాదు
కోపం ఆవేశం ఈ రెండూ ఆగడం లేదు
ఇక ఆగవు కూడా పండిన పంటకు
దక్కిన ఫలితం చూసి కన్నీళ్లు పెడుతూ
ఉద్యమిస్తున్నాడు..
వరంగల్లు దారుల్లో తలెత్తిన నిరసనల హోరు
ఈ ఉదయం ఓ మహోద్యమ జ్వాలను తలపిస్తున్నాయి
గిట్టుబాటు రాని పంట వేసి ఎందుకు ?
వేయకుంటే ఎందుకు? అన్న మాట పెదవి విరుపు
రైతు నుంచి వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో వరంగల్లు ప్రధాన కూడళ్లు
మరో ఉద్యమానికి సిద్ధం అవుతున్నాయి.
అధికారుల జోక్యం ఫలించేనా?
పంటకు గిట్టుబాటు ధర రాక ఒకరు..ధర తక్కువున్నా అమ్మేసుకుందాం అని మరొకరు.. ఇంతటి ఘర్షణాత్మక ధోరణిలో ఎనుమాముల మార్కెట్ యార్డు గొల్లుమంది.తీవ్ర ప్రతిఘటనల మధ్య వివాదం మరింత వేడెక్కుతోంది. రైతులు, దళారీలు మధ్య తగువును అధికారులు తీర్చలేకపోతున్నారు. కాంటాను నిలిపివేయాల్సిందేనని పట్టుబట్టారు. నిర్దేశించిన ధర కన్నా మరో రెండు వేలు అదనంగా ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు.దీంతో వివాదం మరింత పెరిగిపోతోంది. కాంటా అయిన తరువాత ట్రాక్టరు ఎక్కించిన బస్తాలను సైతం దించేశారు. కాంటాను ధ్వంసం చేసి తమ కోపానికి అంతేలేదని నిరూపించారు.
న్యాయం చేయాలని...వినతి
వరంగల్ దారుల్లో ఉద్రిక్తతలు నెలకొన్నాయి.మిర్చి రైతులంతా రోడ్డెక్కి నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. ఎనుమాముల మార్కెట్ యార్డులో నాలుగు గంటలుగా నిరసనలు వ్యక్తం అవుతూనే ఉన్నాయి. రైతులు మార్కెట్ యార్డు లోపలికి చొరబడి అక్కడి సామగ్రిని ధ్వంసం చేసేందుకు సమాయత్తం అయ్యారు.దీంతో ఏ క్షణాన ఏ జరుగుతుందో అన్న ఆందోళనకర వాతావరణం నెలకొని ఉంది. క్వింటా మిర్చిని 17,200 కొనుగోలు చేయాల్సి ఉండగా 14 వేలు లోపే కొనుగోలు చేస్తున్నారని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ నిరసనలకు దిగారు. దళారుల ప్రమేయంతోనే తాము ఏటా నష్టపోవాల్సి వస్తోందని, ఇప్పటికైనా అధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలని వీరంతా కోరుతున్నారు.