సమ్మె చేయడం ఉద్యోగుల హక్కు అని ఎక్కడా చెప్పడం లేదు.కానీ వారు తమ హక్కు అని ప్రకటించుకుంటున్నారు.సమ్మె ను రాజకీయ పార్టీలు కూడా తీవ్ర స్థాయిలో పరిగణించడం లేదు.ఎందుకంటే ఇప్పుడు సమర్థిస్తే రేపటి వేళ తాము అధికారంలోకి వచ్చినప్పుడు కూడా ఇదే విధంగా ఇరకాటంలో పడతామని వారంతా భయపడిపోతున్నారు.అందుకే అధికార పార్టీని రాజకీయంగా ఎదుర్కొనేందుకు ఈ పరిణామాలను తమకు అనుగుణంగా వాడుకునేందుకు పెద్దగా వాడుకోవడం లేదు.ఇప్పుడు తాము మీడియా మైకుల ముందు అరిస్తే అవి రికార్డయి రేపటి వేళ తమ పీకకు చుట్టుకుంటాయి అని అందుకే టీడీపీ పెద్దగా నోరేసుకుని పడిపోవడం లేదు.వైసీపీ మాత్రం సానుకూలంగానే ఉద్యోగులను ఇప్పటికీ చూస్తోంది.సీఎం కూడా పెద్దగా వారిపై కోపం అవుతున్నదీ లేదు. కాస్తో కూస్తో సజ్జల,బొత్స లాంటి వారు ముఖ్యమంత్రి ఆజ్ఞ లేకుండానే కొంత సీరియస్ అయ్యారు. పేర్ని నాని కూడా ఇదే ధోరణిలో ఉన్నారు.కమ్యూనిస్టు నేపథ్యాలున్న మంత్రి పేర్ని నాని కానీ లేదా సజ్జల కానీ అంత వేగంగా ఉద్యోగులతో తగువేసుకోరు.కోలేరు కూడా! కనుక సామరస్య ధోరణిలోనే ఈ సమస్య పరిష్కారానికి నోచుకునేందుకు అవకాశాలే ఎక్కువ.
ఆంధ్రావనిలో ఉద్యోగులకూ, ప్రభుత్వానికి మధ్య దూరం పెంచేందుకు పరిణామాలు కానీ నిర్ణయాలు కానీ సహకరిస్తున్నాయా? అంటే ఔననే సమాధానం వినిపిస్తుంది.జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఉద్యోగులకు చేసిన మేలు ముందుగా 27శాతం ఐఆర్ ను ప్రకటించడం.చేసిన తప్పిదం వీలు లేదని చెప్పి పీఆర్సీ నుంచి తప్పుకోకపోవడం. అదే కనుక చేసి ఉంటే ఇవాళ ఉద్యోగులు చేస్తున్న డిమాండ్ సంబంధిత వర్గాల్లో బలీయంగా నెగ్గుకు వచ్చేదే కాదు.నెగ్గుకు రావడం మాట దేవుడెరుగు అస్సలు వినిపించకపోదును.కానీ జగన్ మాత్రం ఓ మెట్టు దిగాక చేసిన ఆలోచన ఇది అని మాత్రం సుస్పష్టం.ఈ నేపథ్యంలో ఉద్యోగులు వచ్చే నెల ఆరో తారీఖు రాత్రి నుంచి సమ్మెకు వెళ్తామని అంటున్నారు.అదే కనుక జరిగితే యుద్ధ వాతావరణం నెలకొనడం ఖాయం.
ఉద్యోగుల సమ్మెకు సంబంధించి చాలా విషయాలు పరిగణనలోకి తీసుకోవాలి.ఉద్యోగులు జీతాలు మాత్రమే అడుగుతున్నారు పని మాత్రం సక్రమంగా చేయడం లేదు అన్న వాదన ఎప్పటి నుంచో ఉంది.బయోమెట్రిక్ హాజరు అన్నది కేవలం ఓ తంతుగానే మిగిలిపోయింది.థంబ్ వేయడంతోనే తమ ఉద్యోగం అయిపోయిందని రోడ్డు మీద చక్కర్లు కొడుతున్న ఉద్యోగులు ఎందరో! కనుక కోర్టు కూడా సమ్మెకు ఒప్పుకోవడం లేదు.నిన్నటి వేళ హై కోర్టు మాటల ప్రకారం చూస్తే న్యాయమూర్తులు కూడా ప్రభుత్వ పక్షానే ఉన్నారు. అంటే జీతాల తగ్గింపు కానీ పెంపు కానీ ఓ రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాలను అనుసరించే జరిగి ఉంటాయి కానీ మరో ఉద్దేశంతో అయితే కాదు అని కోర్టు కూడా స్పష్టంగా తేల్చేసింది. ఈ తరుణంలో సమస్య ఎలా సాల్వ్ అవుతుందని?