వాడవాడలా గణతంత్ర వేడుకులు జరుగుతున్నాయి.ముఖ్యంగా ప్రధాన రాజకీయ పార్టీలన్నీ తమ శ్రేణులతో ఆనందాలను పంచుకుంటూ ఉన్నాయి. రానున్న కాలంలో ఏం చేయాలో అన్నది చర్చించుకుంటున్నాయి. జాతీయ పండగల వేళ ప్రత్యేక శ్రద్ధతో జనసేన కార్యాలయం ఏటా వేడుకలను చేయడం ఆనవాయితీ..ఈ సందర్భంగా పవన్ తో సహా మిగతా కార్యనిర్వాహక ప్రతినిధులంతా పార్టీ కేంద్ర కార్యాలయానికి చేరుకుని జెండా వందనం చేసి దేశ ప్రగతికి కారకులయిన వారిని స్మరించడం అన్నది
ఏటా జరిగే కార్యక్రమ సరళికే ప్రత్యేకం..ఈ రోజు కూడా అదే కోవలో అదే తోవలో జనసేనాని ఇంకా ఇంకొందరు...
జనసేనాని పవన్ కల్యాణ్ తమ కార్యాలయంలో జాతీయ జెండా ఎగురవేసి వందనం చేశారు.ఈసందర్భంగా గణతంత్రం రోజున తన అభిమానులకు, పార్టీ శ్రేణులకు శుభాకాంక్షలు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పద్మ పురస్కారాలకు కిన్నెర వాద్య కళాకారుడు మొగులయ్య ఎంపిక కావడం తననెంతో ఆనందింపజేసిందని అన్నారు. పురస్కార గ్రహీతను మనఃస్ఫూర్తిగా అభినందించారు. పురస్కారం ప్రకటించినందుకు పీఎం మోడీకి కృతజ్ఞతలు చెల్లించారు. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ తన ఆత్మీయ సందేశాన్ని నిన్నటి వేళ సామాజిక మాధ్యమాల్లో ఉంచారు. ఆ ప్రకటన వివరం యథాతథంగా...
భారతదేశంలో ప్రజాస్వామ్యం పరిఢవిల్లడానికి మన రాజ్యాంగమే మూలమని మనం గర్వంగా చెప్పుకోవచ్చు. అటువంటి రాజ్యాంగం అమలులోకి వచ్చిన జనవరి 26 మనందరికీ ఎంతో పుణ్యదినం.భారతావని సర్వసత్తాక సార్వభౌమ దేశంగా ఆవిర్భవించిన ఈ శుభ తరుణాన్ని పురస్కరించుకుని భారతీయలు అందరికీ నా తరఫున, జనసేన పార్టీ తరఫున 73వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. మన దేశం చిరంతనమైన, పటిష్టమైన, సుసంపన్నమైన గణతంత్ర రాజ్యంగా శోభిల్లడానికి రాజ్యాంగం ద్వారా ప్రాణ ప్రతిష్ఠగావించిన రాజ్యాంగ రూపకల్పన సారధి డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్, రాజ్యాంగ పరిషత్ సభ్యులకూ ఈ సందర్భంగా ప్రణామాలు అర్పిస్తున్నాను. రాజ్యాంగ నిర్మాతలు దేశ ప్రజలకు అందించిన సమన్యాయం, స్వేచ్ఛ, సమానత్వం, సోదర భావం, మత స్వేచ్చ అప్రహతిహతంగా వర్థిల్లాలని... విశ్వ శాంతికి, విశ్వమానవ సౌబ్రాతృత్వానికి, విశ్వ కల్యాణానికి భారతదేశం ఆలంబన కావాలని మనసారా కోరుకుంటున్నాను.