కొత్త జిల్లాల ఏర్పాటుకు సంబంధించి ఇప్పటిదాకా చర్చ నడుస్తూనే ఉంది. కొంత వివాదం కూడా ఉంది.కొత్తగా రెవెన్యూ డివిజన్ల ఏర్పాటు అన్నది చేయకుండా ఎందుకీ కొత్త జిల్లాలు అని కొంత మంది వాదిస్తున్నారు.ముఖ్యంగా కడప జిల్లాలో రాజంపేట వివాదం బాగానే ముదరనుంది.అన్నమయ్య జిల్లా అంటూ రాయచోటి కేంద్రంగా ఏర్పాటయిన జిల్లాలో కొంత భాగం కడప, కొంత భాగం చిత్తూరు జిల్లాలోనికి ఉన్నాయి.మొత్తం ఆరు అసెంబ్లీ నియోజకవర్గాలతో ఏర్పాటయిన అన్నమయ్య జిల్లాకు సంబంధించి చిత్తూరు నుంచి కూడా చాలా విభేదాలు వస్తున్నాయి. ఒకవేళ అన్నమయ్య జిల్లాను ఏర్పాటు చేస్తే మదనపల్లెను జిల్లా కేంద్రంగా ఉంచాలన్న డిమాండ్ బలీయంగా వినిపిస్తోంది. ఇవన్నీ ఇలా ఉంటే శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి అసలు విభజనే సబబుగా లేదని అంటున్నారు ఇక్కడ స్థానిక ఉద్యమ సంస్థలు.
శ్రీకాకుళం అభివృద్ధి వేదిక అంటూ గత కొంత కాలంగా యాక్టివ్ గా ఉన్న ఓ సంస్థ జిల్లాను మూడు ముక్కలు చేయడం అశాస్త్రీయం అని చెబుతూనే మరోప్రతిపాదనతో తెరపైకి వచ్చింది. శ్రీకాకుళం జిల్లాను శ్రీకాకుళం,పలాస, పాలకొండ జిల్లాలుగా విభజించాలని కోరుతోంది. ఇది సాధ్యమయ్యే పని కాకపోయినా కొన్ని రాజకీయ శక్తుల ప్రొద్బలంతో సంబంధిత డిమాండ్ ను వినిపిస్తోందన్న వాదన కూడా ఉంది.అయితే శ్రీకాకుళం విభజన కారణంగా పెద్దగా కోల్పోయింది ఏమీ లేదు. అయితే తరతరాలుగా ఉన్న సీతంపేట ఐటీడీఏ మాత్రం లేకుండా పోయింది. అది మన్యం జిల్లాకు తరలిపోయింది. అంతేకాకుండా పారిశ్రామిక వాడ రాజాం కూడా విజయనగరం జిల్లాలో కలిసిపోయింది.
ఈ విధంగా జిల్లా మూడు జిల్లాలుగా విడిపోయింది. ఒకటి ఎనిమిది నియోజకవర్గాలతో శ్రీకాకుళం ఏర్పాటు కాగా, (అరకు లోక్ సభను రెండుగా విభజించారు. ఇందులో భాగంగా ఒకటి మన్యం జిల్లా, మరొకటి అల్లూరి సీతారామరాజు జిల్లా) మన్యంజిల్లాలో పాలకొండ, ఇక విజయనగరం జిల్లాలో రాజాం వెళ్లిపోయాయి. మొత్తం పది నియోజకవర్గాల శ్రీకాకుళం మూడు జిల్లాలుగా విడిపోయింది.
ఇక కొత్త జిల్లాల ఏర్పాటుకు సంబంధించి జీఓ విడుదలలో చాలా తప్పులున్నాయని తెలుస్తోంది. స్థానిక వ్యవహారం అనుసరించి వీటిని దిద్ది ఇంగ్లీషు పేర్లలో ఉన్న తప్పిదాలను మరోసారి సవరించి జీఓ విడుదల చేయడంతో కాస్త గందరగోళానికి తెరపడింది.