ఆంధ్రావనిలో కొత్త జిల్లాల ఏర్పాటుకు సంబంధించి ప్రభుత్వం చాలా సన్నాహాలు చేస్తోంది.ముఖ్యంగా కార్యాలయాల ఏర్పాటు, నిర్వహణకు సంబంధించి ఇప్పటికే పలుమార్లు అధ్యయనం చేసిందని తెలుస్తోంది. కొత్తగా 13 జిల్లాల రాక నేపథ్యంలో కలెక్టరేట్ల ఏర్పాటుకు సంబంధించి అదేవిధంగా ఇతర కార్యాలయాల నిర్వహణకు సంబంధించి జరగాల్సిన మార్పులు,చేపట్టాల్సిన చేర్పులపై అధికారులు తర్జనభర్జనలు పడుతున్నారు.కొత్త కార్యాలయాలకు ఇప్పటికిప్పుడు మోక్షం దక్కక పోయినా, ఆర్డీఓ కార్యాలయాలనే కలెక్టరేట్లుగా మార్చేందుకు చర్యలు తీసుకుంటున్నారు.అదేవిధంగా కొన్నిచోట్ల అద్దె భవనాల్లో కార్యాలయాల ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నారు. కొత్త కార్యాలయాల ఏర్పాటు నిర్వహణ అదనపు సిబ్బంది నియామకం వీటన్నింటికీ కలిపి పదిహేను వందల కోట్ల రూపాయలు అదనంగా అవుతుందని అంటున్నారు.
ఇప్పటికే అప్పులతో నెట్టుకువస్తున్న ఆంధ్రావనికి ఇప్పటికిప్పుడు అంత మొత్తం సర్దేందుకు వీలు కాకపోవచ్చు.అయినా సరే ముఖ్యమంత్రి పట్టుదల కారణంగా ఆర్డీఓలు కలెక్టర్ తో సహా జేసీ ఓకే చోట ఉండే విధంగా చర్యలు తీసుకుంటున్నారు.ఆ విధంగా కలెక్టరేట్లు కొత్తగా కొలువు తీరనున్నాయి.ఇక మిగతా ఆఫీసుల నిర్వహణపై కూడా ఇప్పటికే పరిశీలనలో కొన్ని భవనాలు ఉన్నాయి.వీటిని అద్దె ప్రాతిపదికన తీసుకుంటే ఎలా ఉంటుంది అన్న ఆలోచన ఉంది.మరి! జిల్లాల సరిహద్దులు తేలాలి కదా! అదేవిధంగా శాఖల మధ్య సమన్వయం ఏంటన్నది తెలియాలి కదా! ఇవన్నీ ఇప్పటికిప్పుడు సర్దుకురావడం జరగని పని.కానీ ఉద్యోగులు సమ్మెలోకి వెళ్లేలోపే కాస్తో,కూస్తో విభజన ప్రక్రియ అన్నది ప్రారంభించాలని జగన్ యోచిస్తున్నారు.ఓ విధంగా పని ఒత్తిడి అయితే కొత్త జిల్లాల రాకతో తగ్గుతుందని ఉద్యోగులు అంటున్నా, ఆఫీసుల నిర్వహణ, కొత్త కలెక్టర్ల రాక ఇవన్నీ మాత్రం
ఒకంతట తేలవు.