గుడివాడ కాసినో వివాదం ఇప్పట్లో తేలేలా లేదు. టీడీపీ ఈ వివాదంపై మాటల యుద్ధం జరుపుతూనే ఉంది. టీడీపీ వేసిన నిజ నిర్థారణ కమిటీ ఇవాళ గవర్నర్ ను కలిసేందుకు రాజ్ భవన్ కు వెళ్లి విషయం అంతా వివరించాలని భావించింది. కానీ ఆ సమయంలో గవర్నర్ కు అస్వస్థతగా ఉండడంతో ఆయన కార్యదర్శి సిసోడియాకు ఫిర్యాదు పత్రాన్ని, అదేవిధంగా ఆధారాలను అందించి వర్ల రామయ్య బృందం నిరాశతో వెనుదిరిగింది. మంత్రి కొడాలి నాని కాస్తా క్యాసినో నానిగా మారిపోయారని విమర్శించారు వర్ల రామయ్య.ఇదే సందర్భంలో పోలీసుల తీరుపైనా ఆయన పలు విమర్శలు యథావిధిగా గుప్పించారు. క్యాసినో వివాదంపై కలెక్టర్ మొదలుకుని డీజీపీ దాకా అన్ని స్థాయిలలో ఉన్న అధికార యంత్రాంగాన్నీ కలిసి, సమస్య వివరించి ఫిర్యాదు చేసినా ఏ ఒక్కరూ పట్టించుకోవడం లేదని వాపోయారు.
ఇదిలా ఉంటే మంత్రి నాని వాదన మాత్రం మరో ఉంది. రాజకీయంగా తనపై పై చేయి సాధించాలన్న ఉద్దేశంతోనే ఆరోపణలు చేస్తున్నారని, తన తప్పులు లేకపోయినా తనను కోరి కోరి ఇరికిస్తున్నారని వాపోతున్నారు. గుడివాడకు పోయి నిజ నిర్థారణ పేరిట టీడీపీ నానా యాగీ చేసిందని, ఇదెంత మాత్రం భావ్యం కాదని అన్నారు. నాని వాదన ఎలా ఉన్నా ఇదే సందర్భంలో నానీ భాష గురించి కూడా చర్చకు వస్తున్నా ఆయన మాత్రం తగ్గడం లేదు. నాని వివరణ ఎలా ఉన్నా కూడా ఆయన భాష మాత్రం అస్సలు అంగీకారంలో లేదు.మీడియాలో రాయలేని భాషకు మాత్రం ఆయన వివరణ ఇవ్వమన్నా ఇవ్వరు.