గ్రామాల్లో, మండలాల్లో ఉన్న చిన్న చిన్న సమస్యలను తన దృష్టికి తీసుకొస్తే.. అవి మరింతమందికి తెలిసే అవకాశం ఉందన్నారు పవన్ కల్యాణ్. ఉద్ధానం ఎక్కడో మారుమూల గ్రామం అని, ఆ సమస్యను తాను హైలెట్ చేసిన తర్వాతే ఎక్కువమందికి తెలిసిందని, అది ప్రపంచ సమస్యగా మారిందని చెప్పారు పవన్. ఓ వ్యక్తిగా తాను చేయగలిగింది చేస్తానని, ఎక్కువమంది దృష్టికి సమస్యలను తీసుకెళ్తానని అన్నారు. నాయకుడికి హృదయం ఉండాలని చెప్పారు పవన్ కల్యాణ్. నాయకుడు మనుషులతో మాట్లాడాలని, సమస్యలకు పరిష్కారం వెంటనే రాదని, పదిమందితే మాట్లాడేకొద్దీ పరిష్కారం లభించే మార్గం దొరుకుతుందని చెప్పారు పవన్.
ఆంధ్రప్రదేశ్ కి వైసీపీ హానికరం అని సెటైర్లు వేశారు పవన్ కల్యాణ్. ఏ ఒక్కరి వల్లో ఏపీ బాగుపడుతుందని తాను అనుకోవడంలేదని, చిత్తశుద్ధితో ఉన్న కార్యకర్తలు ప్రతి గ్రామంలో ఉండాలని, అలాంటి కార్యకర్తలు గ్రామానికి పదిమంది ఉంటే, రాష్ట్రానికి బలమైన నేతలు ఉంటారని, అలాంటి సమూహాల వల్లే ప్రజలు సమస్యలనుంచి బయటపడగలరని చెప్పారు. అంతేకానీ, ఒక్కరి వల్లా ఏదీ సాధ్యం కాదని చెప్పారు. అయితే సమస్యల పరిష్కారం అనే బాధ్యతను జనసేన తీసుకుంటుందని, వచ్చే ఎన్నికల్లో రాష్ట్రాన్ని వైసీపీ రాక్షస పాలన నుంచి బయటపడేస్తుందని చెప్పారు. ఏపీలో అనేక సమస్యలు పెండింగ్ లో ఉన్నాయని, వాటిని పరిష్కరించే బాధ్యత ప్రభుత్వానికి లేదని, యువతకు ఉపాధి, ఉద్యోగాల్లేవని ఆవేదన వ్యక్తంచేశారు పవన్ కల్యాణ్. ప్రజా సమస్యల పరిష్కారానికి ఎమ్మెల్యేలకు కూడా ఓపిక లేదని, కానీ వారు మాత్రం పండగలు, పుట్టినరోజు కార్యక్రమాలు, ఇలా రకరకాల సంబరాలకు సమయం కేటాయిస్తారని ఎద్దేవా చేశారు.