ఏపీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు వ్యక్తిత్వం గురించి మరో మారు ఆసక్తికర అంశం వెలుగులోకి వచ్చింది. బాబుకోసం పనిచేసిన వారి పట్ల ఆయన వ్యవహరించే తీరు తేటతెల్లం అయింది. ప్రసిద్ధ నటి సుమలత తన భర్త అంబరీశ్ పాతినిధ్యం వహించిన మాండ్య లోక్సభ నియోజకవర్గం నుంచి బరిలో దిగిన సంగతి తెలిసిందే.
తన భర్త వారసత్వాన్ని ఆమె కొనసాగిద్దామని అనుకోవడం వల్లే అక్కడ్నించి స్వతంత్ర అభ్యర్థిగానైనా పోటీ చేయడానికి సిద్ధపడ్డారు. కాంగ్రెస్ పార్టీ టికెట్ నిరాకరించడంతో మాండ్య నుంచే స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగారు. అయితే, ఆమె పట్ల చంద్రబాబు వ్యవహరించిన తీరు చర్చనీయాంశంగా మారింది.
కర్ణాటక సీఎం హెచ్ డీ కుమారస్వామి కుమారుడు, నటుడు నిఖిల్ కుమారస్వామి జేడీ(ఎస్) తరపున మాండ్యా లోక్ సభ స్థానం నుంచి పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. ఆయనకు మద్దతుగా చంద్రబాబు ప్రచారం నిర్వహించారు.
దీనిపై తాజాగా సుమలత స్పందిస్తూ, ఏపీ సీఎం చంద్రబాబు పచ్చి అవకాశవాది మండిపడ్డారు. ఏపీలోని రేపల్లెలో టీడీపీ అభ్యర్థికి తాను మద్దతిచ్చానని సుమలత అన్నారు. చంద్రబాబు మాత్రం ఇక్కడికొచ్చి(మాండ్య) నాకు వ్యతిరేకంగా ప్రచారం చేసి తన వెన్నుపోటు నైజాన్ని చూపించాడని సుమలత విమర్శించారు. సుమలతకు ఓటెయ్యొద్దని తెలుగు ప్రజలకు చెప్పారని అమె అన్నారు.
కాగా, మాండ్యలో సుమలతకు ప్రజల సానుభూతి లభిస్తుందా అన్నది ఇప్పుడు కర్ణాటక రాజకీయవర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. 2018 లో మరణించిన సుమలత భర్త అంబరీశ్ పట్ల ప్రజల్లో ఉన్న సానుభూతి ఇక్కడ పనిచేయవచ్చునని పలువురు భావిస్తున్నారు. అది సుమలతకు మేలు చేస్తుందేమో చూడాలి మరి.