తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఢిల్లీ వేదికగా గలం విప్పే అవకాశం కల్పించడంలో ఆయన ఆసక్తికర నిర్ణయం తీసుకున్నారని అంటున్నారు. టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో కట్టబెట్టిన పదవుల్లో ఇంటి మనిషికి ఓ పదవి కట్టబెడితే...తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు మనిషి అనే ముద్ర ఉన్న వ్యక్తికి కీలక పదవి కట్టబెట్టారని అంటున్నారు. లోకసభ పక్ష నాయకుడిగా ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వర్ రావును ఎన్నుకున్న నేపథ్యంలో....ఈ చర్చ తెరమీదకు వచ్చింది.
ఈ నెల 17 నుంచి పార్లమెంట్ సమావేశా ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రగతిభవన్లో మధ్యాహ్నం 2 గంటలకు పార్టీ నేఎంపీలతో సమావేశం అయ్యారు. లోక్సభ ఎన్నికల ఫలితాల అనంతరం తొలిసారిగా జరిగిన ఈ సమావేశంలో పార్టీ లోక్సభాపక్ష నేతపై నిర్ణయం తీసుకున్నారు. ఈ సమావేశంలో పార్లమెంటరీ పార్టీ నేత, లోక్ సభా పక్ష నేత, రాజ్యసభ పక్ష నేతలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. పార్లమెంటరీ పార్టీ నాయకుడిగా సీనియర్ ఎంపి కె.కేశవరావును ఎన్నుకున్నారు.
లోకసభ పక్ష నాయకుడిగా ఖమ్మం ఎం.పి. నామా నాగేశ్వర్ రావును, ఉప నాయకుడిగా మెదక్ ఎం.పి. కొత్త ప్రభాకర్ రెడ్డిని, విప్ గా జహీరాబాద్ ఎం.పి. బిబి పాటిల్ ను ఎన్నుకున్నారు. రాజ్యసభలో టిఆర్ఎస్ పక్ష నాయకుడిగా ఎంపి కె.కేశవరావును, ఉప నాయకుడిగా బండ ప్రకాశ్ ను, విప్ గా జోగినిపల్లి సంతోష్ కుమార్ ను ఎన్నుకున్నారు. టిఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నాయకుల ఎంపికకు సంబంధించిన సమాచారంతో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషికి లేఖ రాశారు.
కాగా, కేసీఆర్ తన పార్టీ ఎంపీలకు కట్టబెట్టిన పదవులపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. లోక్సభ నేతగా తన పార్టీ నుంచి తొలిసారిగా ఎంపీగా గెలిచిన నామా నాగేశ్వరరావుకు కేసీఆర్ అవకాశం కల్పించారు. ఆయనకు ఏపీ మాజీ సీఎం, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు నమ్మినబంటు అనే పేరున్న సంగతి తెలిసిందే. అలాంటి వ్యక్తికి పార్టీలో చేరిన వెంటనే ఎంపీ టికెట్ ఇవ్వడం ...ఆ వెంటనే పార్లమెంటరీ నేతగా బాధ్యతలు ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది. మరోవైపు తమ కుటుంబ సభ్యుడు అయిన ఎంపీ జోగినపల్లి సంతోష్కుమార్కు విప్గా కేసీఆర్ అవకాశం కల్పించారు.