రాజకీయ చైతన్యం ఉన్న జిల్లాగా పేరు పొందిన నెల్లూరులో సమస్యలు అనేకం. ఒకప్పుడు ఈ జిల్లా..ఉమ్మడి ఆంధ్రప్రదే శ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రులను అందించింది. అదేసమయంలో ఆర్థిక మంత్రులు కూడా ఈ జిల్లా నుంచి అసెంబ్లీలో లెక్కలు వేశారు. అంతేకాదు, అనేక మంది మంత్రులు కూడా ఈ జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహించారు. అలాంటి జిల్లా నుంచి గతంలో ఎన్నడూలేని విధంగా యువ మంత్రులు అసెంబ్లీలోకి అడుగు పెట్టారు. దీంతో ఇప్పుడు జిల్లా ప్రజల దృ ష్టి మొత్తం.. ఈ యువ మంత్రులపైనే ఉంది. వాస్తవానికి ఈ దఫా నెల్లూరులో వైసీపీ క్లీన్ స్వీప్ చేసేసింది. గతంలో ఎన్న డూ ఏ పార్టీ చేయని విధంగా మొత్తం సీట్లను వైసీపీ గెలుచుకుంది.
గెలిచిన వారిలో ఆనం రామనారాయణరెడ్డి వంటి సీనియర్ మోస్ట్ నాయకులు కూడా ఉన్నారు. అయినా కూడా జగన్ మాత్రం ఇద్దరు యువ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్(బీసీ), మేకపాటి గౌతంరెడ్డి(ఓసీ)లకు మంత్రులుగా ఛాన్స్ ఇచ్చారు. ఇద్దరూ విద్యావంతులు, అనిల్ ఏకంగా డాక్టర్ కూడా. దీంతో ఈ ఇద్దరూ జిల్లాలో కీలకంగా మారారు. పదవుల్లో ఉండేది రెండున్నరేళ్ల కాలమేనని జగన్ చెబుతున్నా.. పనితీరు బాగుంటే వారిని పొడిగించే అవకాశం లేకపోలేదు. ఇక, ఇప్పటి వరకు ఉన్న రాజకీయ, సామాజిక పరిస్థితిని ఒకసారి గమనిస్తే.. జిల్లాలో అనేక సమస్యలు ఉన్నాయి. ముఖ్యంగా తీరప్రాంత భద్రత పెద్ద సమస్య.
అదేసమయంలో పారిశ్రామికంగా జిల్లాను అభివృద్ధి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇక, కేంద్రం నుంచి నిధులు రాబట్టి జిల్లాలోని కరువు పీడిత మండలాలను ఆదుకోవాల్సిన బాధ్యత మంత్రులపై ఉంది. ఉపాధి, ఉద్యోగ అవకాశాల పెంపు వంటి వాటికి కూడా ప్రాధాన్యం పెంచాల్సిన అవసరం ఉంది. ఇక, రాజకీయంగా చూస్తే.. టీడీపీకి ఈ జిల్లాలో కోలుకోలేని దెబ్బ తగిలింది.ఊహించని విధంగా ప్రజలు టీడీపీని దెబ్బకొట్టారు. అదే సమయంలో వైసీపీకి పట్టంకట్టారు. ఈ పరిణామాల నేపథ్యంలో వైసీపీ మరింత పుంజుకునేందుకు ఇదే సరైన సమయం అంటున్నారు పరిశీలకులు. అయితే, ఇది రాజకీయంగానే కాకుండా సామాజికంగా కూడా ముందు చూపుతో వ్యవహరించాల్సిన సమయమని చెబుతున్నారు. మరి మంత్రులు ఎలా ముందుకు వెళ్తారో చూడాలి.