ఏపీ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు తనయుడు, ఇటీవల ప్రత్యక్ష ఎన్నికల్లో తొలిసారిగా పోటీ చేసి ఓటమి పాలయిన మాజీ మంత్రి నారా లోకేష్ మరోమారు బుక్కయ్యారు. తనదైన చర్యలు, కామెంట్లతో నవ్వులపాలు అవడంతో పాటుగా తెలుగుదేశం పార్టీని ఇరకాటంలో పడేసే ఈ పచ్చపార్టీ యువనేత...మళ్లీ అదే రీతిలో అధికార వైసీపీకి అడ్డంగా దొరికిపోయారు. ఏకంగా హోంమంత్రి గణాంకాలతో సహా కౌంటర్ ఇచ్చేసరికి...తెలుగుదేశం నేలు షాక్ తిన్నారు. అంతేకాకుండా మిడిమిడి జ్ఞానంతో పరువు గంగపాలు చేసుకున్నారని...లోకేష్ తీరును చూసి పలువురు చర్చించుకుంటున్నారు.
వివరాల్లోకి వెళితే... ఇటీవల జరిగిన ఎన్నికల ఫలితాల అనంతరం ఆంధ్రప్రదేశ్లోని పలు గ్రామాల్లో వ్యక్తిగత కక్షలతో టీడీపీ-వైసీపీ శ్రేణులు పరస్పరం విమర్వలు, దాడులు చేసుకున్న సంగతి తెలిసిందే. దీనిపై లోకేష్ స్పందిస్తూ....``రాష్ట్ర వ్యాప్తంగా తెదేపా కార్యకర్తలు, సానుభూతిపరులపై వైకాపా రౌడీలు జరుపుతున్న దాడులు, దౌర్జన్యాలతో తెలుగుదేశం పార్టీ కేడర్ సహనాన్ని పరీక్షించవద్దని హెచ్చరిస్తున్నాను. గెలుపు అనేది బాధ్యత పెంచాలి తప్ప అరాచకాలకు మార్గం కాకూడదు.`` అంటూ ఎప్పట్లాగే ట్వీట్ చేశారు. లోకేష్ ట్వీట్ చర్చనీయాంశంగా మారిన నేపథ్యంలో....ఏపీ హోంమంత్రి సుచరిత మీడియాతో స్పందిస్తూ..ఆసక్తికర వివరాలు వెల్లడించారు.
టీడీపీ కార్యకర్తలపై దాడులు చేస్తున్నారని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శాంతిభద్రతలు సరిగా లేవంటూ మాజీ మంత్రి, టీడీపీ నేత నారా లోకేష్ సోషల్ మీడియాలో చేసిన ట్వీట్లపై ఏపీ డిప్యూటీ సీఎం, హోంశాఖ మంత్రి సుచరిత సీరియస్గా స్పందించారు. లోకేష్ ట్వీట్ చేయడంపై స్పందించిన ఆమె... మహిళా అధికారిని చెంప మీద కొట్టినా పట్టించుకోని పరిస్థితి అప్పట్లో ఉండేదని సెటైర్లు వేశారు. అన్యాయాన్ని నిలదీసినందుకు మా ఎమ్యెల్యే రోజాను అసెంబ్లీకి రాకుండా అడ్డుకున్నారని మండిపడ్డ సుచరిత... మా గురించి మాట్లాడే అర్హత టీడీపీకి లేదని కౌంటర్ ఇచ్చారు. అప్పట్లో వైఎస్ జగన్పై దాడి జరిగినా కోడికత్తి అంటూ ప్రచారం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. శాంతిభద్రతలకు విఘాతం కల్గించొద్దని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎప్పుడో చెప్పారని హోంమంత్రి సుచరిత గుర్తుచేశారు.ఇటీవల గొడవల్లో టీడీపీ వాళ్లు 44 మంది గాయపడితే వైసీపీకి చెందిన వాళ్లు 57 మంది గాయపడ్డారని వివరణ ఇచ్చారు. హోంమంత్రి వెల్లడించిన ఈ గణాంకాలతో అంతా లోకేష్ జ్ఞానం గురించి చర్చించుకుంటున్నారు.