ఏపీ మాజీ సీఎం చంద్రబాబు విదేశీ ప్రయాణాలకు వెళ్లారు. బుధవారం నుంచి ఈ నెల 24 వరకు ఆయన తన కుటుంబ సమేతంగా ఐరోపా పర్యటనకు వెళ్లారు. వాస్తవానికి ఈ పర్యటన ఇప్పటికే ఒక సారి వాయిదా పడింది. ఏపీ అసెంబ్లీ తొలి సమావేశాలు ఉండడంతో చంద్రబాబు ఈ నెల రెండో వారంలోనే విదేశీ పర్యటనకు వెళ్లాలని అనుకుని కూడా వాయిదా వేసుకున్నారు. ఇక, తొలి దశ సమావేశాలు ముగియడంతో చంద్రబాబు ఐరోపా పర్యటనకు వెళ్లారు.
అయితే, ఈ పర్యటన కు వెళ్లడం వెనుక రీజన్ ఏమై ఉంటుంది? ప్రధాని నరేంద్ర మోడీ బుధవారం దేశంలోని అన్ని పార్టీల ప్రధాన నేతలను ఢిల్లీకి ఆహ్వానించారు. నిజానికి ఈ కార్యక్రమం కూడా వారం ముందుగానే నిర్ణయించారు. ప్రత్యేకంగా ప్రధాని నరేంద్ర మోడీ అన్ని పార్టీల ప్రధా న నేతలకు స్వయంగా లేఖలు రాశారు. పార్లమెంటులో అనుసరించాల్సిన వ్యూహం సహా.. దేశంలో జమిలి ఎన్నికలపై చర్చించాలని మోడీ ఓప్రత్యేక అజెండా కూడా నిర్ణయించుకున్నారు.
అదే సమయంలో ఎన్నికల సంస్కరణల విషయం పై కూడా చర్చించాలని తీర్మానించారు. ఆయా అంశాలను పేర్కొంటూ..దేశవ్యాప్తంగా ఉన్న అన్ని ప్రధాన పార్టీ అధ్యక్షు డు, ప్రధాన కార్యదర్శులకు మోడ లేఖలు రాయడం గమనార్హం. ఈ క్రమంలోనే టీడీపీ అధినేత స్థానంలో ఉన్న చంద్ర బాబుకు కూడా లేఖ పంపారు. దీంతో చంద్రబాబు విదేశీ పర్యటన వాయిదా పడుతుందని అందరూ అనుకున్నారు. గతంలో చంద్రబాబు దేశంలో పోరాటాలు చేసింది కూడా ఈ సమస్యలపైనే కదా! ఇప్పుడు వచ్చిన అవకాశాన్ని ఆయన సద్వినియోగం చేసుకుంటారని అందరూ అనుకున్నారు.
అయితే, చంద్రబాబు ఈ మీటింగ్ను తప్పించుకుని, ఐరోపాకు వెళ్లిపోయారు. దీనికి ప్రధాన కారణం.. ఏపీలో జరిగిన తాజా ఎన్నికల్లో ఎదురైన ఘోర పరాజయం నుంచి చంద్రబాబు బయటపడలేక పోవడమేనని అంటున్నారు పరిశీలకలు. అసలు ఆయన తొలి అసెంబ్లీ సమావేశాలకు వెళ్లడమే పెద్ద పొరపాటని, అధికార పార్టీ వైసీపీ నుంచి ఎదురైన దెప్పిపొడుపులు, సవాళ్లు, ఓటమికి కారణాలు వంటి వాటితో చంద్రబాబు విసిపోయారని అందుకే ఆయన మళ్లీ డిస్టర్బ్ కాకూడదనే ఉద్దేశంతోనే మోడీ సభకు డుమ్మా కొట్టారని అంటున్నారు. మొత్తానికి చంద్రబాబుకు రాబోయే రోజుల్లో మరెన్ని చిక్కులు వస్తాయో చూడాలి.