అవును! రాజకీయంగా ఇప్పటి వరకు రాష్ట్రానికి మాత్రమే పరిమితమైన వైసీపీ అధినేత, ఏపీ సీఎం జగన్.. ఒకే ఒక్క అస్త్రంతో ఇప్పుడు దేశవ్యాప్తంగా లీడర్ అయిపోయాడు. అంతేకాదు, దేశంలోని అన్ని రాజకీయ పక్షాలకు అందరివాడుగా మారిపోయారు! అంతలోనే ఇంత మార్పా? ఏం జరిగింది? అనే సందేహాలు కామన్!! జగన్.. గత సీఎం చంద్రబాబు మాదిరిగా ఊరూ వాడా వెళ్లి ఎక్కడా ఎవరి నుంచి సన్మానాలు చేయించుకోలేదు. ఎవరికీ అనుకూలంగా డబ్బా కొట్టలేదు. ఎవరికీ వ్యతిరేకంగా ప్రకటనలు గుప్పించి.. తిట్ట పురాణాన్ని లఖించుకోలేదు.
అయినా కూడా ఒకే ఒక్క అస్త్రంతో ఆయన అన్ని పార్టీల మనసులును గెలుచుకున్నారు. మాయావతి, ములాయం, నితీష్ వంటి రాజకీయ ఉద్ధండులు శభాష్ అనేలా వ్యవహరించారు. ఈ నేపథ్యంలో ఇంతకీ ఏం జరిగింది? అనే ప్రశ్న సాధారణంగా తెరమీదికి వస్తుంది. తాజాగా రాజ్యసభ తొలి భేటీలో దేశంలోని ఓబీసీలకు రిజర్వేషన్ ఇచ్చే అంశంపై చర్చ జరిగింది. ఈ సందర్భంగా పలు ప్రాంతీయ పార్టీలు దీనిపై ఎలాంటి నిర్ణయాన్నీ స్పష్టంగా ప్రకటించలేదు.
కానీ, ఈ సమయంలో జోక్యం చేసుకున్న వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి రాజ్యసభలో 15 నిముషాలకు పైగా మాట్లాడి జగన్ వాయిస్ను పెద్దల సభలో గట్టిగా వినిపించారు. దేశంలో ఓబీసీల స్థితి గతులను ఈ సందర్భంగా విజయసాయి వినిపించారు. ఈ క్రమంలోనే ఆయన జగన్ ప్రభుత్వంలో సామాజిక ఇంజనీరింగ్ అద్భుతంగా అమలు అవుతోందని తెలిపారు. ఇదే విషయాన్ని ట్విట్టర్లోనూ వెల్లడించారు. ఓబీసీలకు చట్టసభల్లో 50 శాతం రిజర్వేషన్ కల్పించాలని కోరుతూ రాజ్యసభలో ప్రైవేటు బిల్లు ప్రవేశ పెట్టామని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ విజయసాయి రెడ్డి ట్విట్టర్లో పేర్కొన్నారు.
ఈ బిల్లుపై జరిగే చర్చ తప్పని సరిగా వారి అభ్యున్నతికి దారులు వేస్తుందని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. సీఎం జగన్ ఆదేశాల మేరకు రాజ్యసభలో బిల్లు పెట్టామని, ఓబీసీలంతా సామాజికంగా ఉన్నతస్థాయికి ఎదగాలని సీఎం జగన్ ఆకాంక్ష అని విజయసాయి ట్విట్టర్లో పేర్కొన్నారు. అయితే, దీనిపై దేశవ్యాప్తంగా మద్దతు లభించడం విశేషం. ఈ దెబ్బతో జగన్ దేశవ్యాప్త నాయకుడు అయ్యాడని అంటున్నారు రాజకీయ పండితులు!