ఔను. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఆవేదనలో ఉన్నారు. జరుగుతున్న పరిణామాల గురించి ఆయన కలత చెందుతున్నారు. ఉప రాష్ట్రపతిగా...దేశంలో చోటుచేసుకుంటున్న ప్రత్యేకంగా తెలుగు నేలపై జరుగుతున్న సంఘటనలపై ఆయన ఆవేదనలో ఉన్నారట. ఇంతకీ ఎందుకీ రాజకీయ దిగ్గజం కలవరపాటుకు గురవుతున్నారనే కదా? మీ సందేహం? తెలుగుదేశం పార్టీకి చెందిన నలుగురు రాజ్యసభ సభ్యలు సుజనా చౌదరి, సీఎం రమేశ్, టి.జి వెంకటేష్, గరికపాటి రామ్మోహన రావు రాజ్యసభలో తమను వేరే గ్రూపుగా పరిగణించాలంటూ రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడుకు లేఖ ఇచ్చేయడం...రాజ్యంగ పరంగా ఆ లేఖను రాజ్యసభ చైర్మన్ ఆ లేఖకు ఆమోద ముద్ర వేసేయడం వల్ల.!
అనూహ్య రీతిలో టీడీపీ ఎంపీలు పార్టీ ఫిరాయించేసిన సంగతి తెలిసిందే. అయితే, తెలుగుదేశం రాజ్యసభ సభ్యుడు తనకు లేఖ ఇవ్వడానికి రెండు రోజుల ముందు జరిగిన కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు చీటికీ మాటికీ పార్టీలు మారడంపై వెంకయ్యనాయుడు అసహనం వ్యక్తం చేశారు. ఇలా పార్టీలు మారిన వారు తమ పదవులకు రాజీనామా చేయాలని, ఆ తర్వాతే పార్టీ మారాలని ఆ కార్యక్రమంలో వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. ఒకవేళ సభ్యులు రాజీనామా చేయకపోతే ఆయా సభలు ఆ సభ్యుల పదవిని రద్దు చేయాలని కూడా సూచించారు. ఇది జరిగిన రెండు రోజులకే తెలుగుదేశం రాజ్యసభ సభ్యులు పార్టీ మారడం, వారిని ప్రత్యేక గ్రూపుగా పరిగణించాలని లేఖ ఇవ్వడం ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడుకు మనస్తాపాన్ని కలిగించిందని ఆయన సన్నిహితులు చెబుతున్నారు.అధికారికంగా ఇవన్నీ జరిగిన సీనియర్ రాజకీయ నాయకుడిగా, విలువలకు ప్రాధాన్యమిచ్చే నాయకుడిగా ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఈ పరిణామాలపై కలత చెందినట్లు సమాచారం.
ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు కలత చెందడంపై వస్తున్న వార్తలపై పలువురు భిన్నంగా స్పందిస్తున్నారు. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఆవేదనగా ఉండటంలో తప్పేమీ లేనప్పటికీ...గతంలో ఏపీలో ఇదే తరహా పరిణామాలు సంభవించినప్పటికీ ఆయన ఇటు సీనియర్ రాజకీయవేత్తగా అనంతరం ఉపరాష్ట్రపతిగా సైతం స్పందించలేదని గుర్తుచేస్తున్నారు. వైసీపీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు, ఎంపీలను ఏపీ ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబునాయుడు పార్టీ ఫిరాయింపచేసినప్పటికీ....వైసీపీ ఈ విషయంలో ఆందోళనలు చేసినా...ఆనాడు స్పందించలేదని కొందరు నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.