తెలుగుదేశం పార్టీకి సపోర్ట్గా తన వాయిస్ను బలంగా వినిపించే వాళ్లలో ముందు వరుసలో ఉంటారు ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న. చంద్రబాబు ఎమ్మెల్సీ ఇచ్చాక బుద్ధా విపక్షాలపై మరింత దూకుడుగా ముందుకు వెళ్లేవారు. పార్టీ ఓడిపోయాక చాలా మంది మీడియాకు మొహం చాటేస్తున్నా బుద్ధా మాత్రం ఏదో ఒక వ్యాఖ్యలతో మీడియాలో ఉంటూనే ఉన్నారు. తాజా ఎన్నికల్లో వైసీపీ విజయం సాధించడంతో బుద్ధా ఈవీఎంలను టార్గెట్గా చేసుకుని కూడా విమర్శలు చేశారు.
ఇక ఇప్పుడు నెటిజన్లు బుద్ధాను ఆటాడుకోవడం స్టార్ట్ చేసేశారు. బుద్ధా వైసీపీలో చేరిపోతున్నారంటూ సోషల్ మీడియాలోకి ఎంట్రీ ఇచ్చిన ఓ పోస్ట్ ఇప్పుడు వైరల్ గా మారిపోయింది. ఈ పోస్టు జోరుగా వైరల్ అవ్వడంతో పాటు చివరకు బుద్ధా దగ్గరకు వెళ్లిపోయింది. దీంతో బుద్ధా వెంకన్నకు చిర్రెత్తుకొచ్చేలా చేసింది. చివరకు ఆయన వివరణ ఇచ్చుకోక తప్పలేదు. సోషల్ మీడియాలో పోస్టుపై స్పందించడం దేనికి అనుకుంటే దీనిని నిజమని నమ్మేవాళ్లు చాలా మందే ఉంటారు.
అదిగో పులి..ఇదిగో తోక అన్న చందంగా ఇంకేముంది మన వెంకన్న కూడా జంప్ అవుతున్నాడంటగా అని టీడీపీ వాళ్లు కూడా దీనిని చలవలు పలవలు చేసేస్తారు. చివరకు ఈ వైరల్ పోస్టుపై వెంకన్న వివరణ ఇచ్చుకున్నారు. ఆయన ఈ పోస్ట్ ను ఖండించడంతో పాటుగా ఏకంగా దానిపై విజయవాడ పోలీస్ కమిషనర్ కు ఫిర్యాదు చేయడంతో పాటు ఆ పోస్ట్ పెట్టినవారెవరో గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని కూడా కోరారు.
ఈ క్రమంలోనే ఆయన చేసిన వ్యాఖ్యలు కూడా సంచలనంగానే ఉన్నాయి. తాను ఏపీలో అధికార వైసీపీకి ధీటుగా బదులు ఇస్తున్నానని.. అందుకే వైసీపీ వాళ్లు తనపై మైండ్గేమ్ ప్రారంభించారని.. ఈ క్రమంలోనే తాను వైసీపీలోకి వెళుతున్నట్టు పోస్ట్ క్రియేట్ చేసి సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారని ఆయన ఆరోపించారు. తాను పార్టీ మారాల్సి వస్తే.. తన రాజకీయ ఎదుగుదలకు కారణమైన టీడీపీ అధినేత చంద్రబాబు పాదాల దగ్గర ప్రాణాలు వదిలేస్తానని చెప్పడం గమనార్హం. ఏదేమైనా బుద్ధాను ఓ సోషల్ మీడియా పోస్ట్ కాస్త టెన్షన్ పెట్టించింది.