చిరంజీవి సినీ జీవితానికే పరిమితమైపోయారు. ఆయన రాజకీయాల వూసు ఎత్తడంలేదు. ఆయన్ని ముందు పెట్టి కధ నడిపించాలని అనుకున్నా కూడా కచ్చితంగా నో చెప్పేశారు. తాను రాజకీయాలతో పూర్తిగా విసిగిపోయాయని ఓ సమయంలో చిరంజీవి కూడా అన్నారట. ఇక ఆయన సినీ జీవితం కూల్ గా సాగుతోంది. సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా ఆయన సత్తా చాటుతున్నారు. మళ్ళీ అయిదేళ్ళ వరకూ ఎన్నికలు లేవు
ఈ టైంలో చిరంజీవి రాజకీయాల్లోకి రావాల్సిన అవసరం ఉందా. అంటే ఉంది అంటోంది కమలం పార్టీ. ఏపీలో చిరంజీవిని బీజేపీ పార్టీ ప్రెసిడెంట్ చేసి కాపుల ఓట్లు గుత్తమొత్తంగా కొల్లగొట్టడానికి ప్లాన్ చేస్తోంది. చిరంజీవి అవును అంటే ఆయనకు అన్ని విధాలుగా పెద్ద పీట వేయాడానికి కూడా రెడీ అవుతోంది.
ఈ మేరకు ఆపరేషన్ కమలం స్టార్ట్ అయిందట. చిరంజీవితో పాటు, బలమైన నాయకులను తీసుకురావడం ద్వారా ఏపీ బీజేపీకి కొత్త కళను రప్పించాలనుకుంటున్నారు. చిరంజీవి సామాజిక వర్గం ఏపీలో 70 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఉన్నారు. అందువల్ల వారిని ఆకట్టుకుంటే సులువుగా అధికార పీఠం పట్టేయవచ్చు అన్నది ఆలోచనట.
చిరంజీవిని రాజకీయాల్లోకి లాగేందుకు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్ మాధవ్ రంగంలోకి దిగారని అంటున్నారు. ఆయనకు సహాయంగా ఏపీకి చెందిన టీడీపీ మాజీ మంత్రి కూడా ఒకరు ఉన్నారని, ఆయన, చిరంజీవి గతంలో ప్రజారాజ్యంలో కూడా పనిచేశారని చెబుతున్నారు. మరి చిరంజీవి రాజకీయాల్లోకి వస్తారా అన్నది చూడాలి.