కాంగ్రెస్ పార్టీ అసంతృప్త నేతగా ముద్రపడిన ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ వ్యతిరేక గాలి వీచినా తన సత్తా చాటుకున్న సంగతి తెలిసిందే. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో మునుగోడు స్థానం నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి... అనంతరం పార్లమెంట్ ఎన్నికల్లో భువనగిరి ఎంపీ స్థానం నుంచి బరిలోకి దిగిన తన సోదరుడు, మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి విక్టరీలో కీలక పాత్ర పోషించారు. అనంతరం, ఎమ్మెల్సీ ఎన్నికల్లో తన భార్యను పోటీకి దింపి ఓటమిపాలయ్యారు. గత కొద్దికాలంగా కలకలం సృష్టిస్తున్న ఆయన తాజాగా మరిన్ని కామెంట్లు చేశారు.
ప్రస్తుతం ఢిల్లీలో ఉన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఈ సందర్భంగా ఓ మీడియా సంస్థతో మాట్లాడుతూ, సంచలన వ్యాఖ్యలు చేశారు. వారం పదిరోజుల్లో అధికారికంగా బీజేపీలో చేరబోతున్నానని ప్రకటించారు. తన మద్దతుదారులందరూ తన వెంటే ఉన్నారని ప్రకటించారు. రాబోయే రోజుల్లో బీజేపీదే అధికారం అంటూ ధీమా వ్యక్తం చేశారు. తనను గెలిపించిన ప్రజలకు న్యాయం చేయాలన్నా, తెలంగాణలో టీఆర్ఎస్ ను ఎదుర్కోవాలన్నా అది బీజేపీతో సాధ్యం అని కోమటిరెడ్డి అన్నారు. గతంలో తాను చేసిన వ్యాఖ్యలను బీజేపీ నేతలు స్వాగతించారు. నన్ను బీజేపీలోకి ఆహ్వానించారన్న ఆయన.. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రాబోతుందన్నారు. మాలాంటివాళ్లు బీజేపీలో చేరితే.. కాంగ్రెస్ ఖాళీ అవుతుందని.. వచ్చే ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి వస్తుందనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు
ఇదే సమయంలో కాంగ్రెస్ పార్టీపైనా ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీలో పీసీసీ చీఫ్ పదవి కోరుకున్న మాట వాస్తవమేనన్న కోమటిరెడ్డి... ప్రజల మద్దతుతో కాంగ్రెస్ను అధికారంలోకి తేవాలనుకున్నా.. కానీ, అనుకున్న ఫలితాలను సాధించలేకపోయాం అన్నారు. ఇప్పుడు నాకేం పదవులు వద్దు... ఇచ్చానా కాంగ్రెస్లో ఉండను అని ప్రకటించారు. తాను ప్రజల కోసం, తెలంగాణ రాష్ట్రం కోసం ఆలోచించే వ్యక్తిని తప్ప.. పార్టీ కోసం ఆలోచించనని... పార్టీ షోకాజ్ నోటీసులకు సమాధానం ఇచ్చే విషయంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదన్నారు. తప్పు వాళ్లు చేసి.. షోకాజ్ నోటీసు నాకేంటి? అంటూ కాంగ్రెస్ నేతలపై ఫైర్ అయ్యారు. నన్ను నమ్ముకున్న ప్రజల కోసం బీజేపీలోకి వెళ్తున్నానని స్పష్టం చేశారు.