నామినేటెడ్ పదవుల పంపకానికి ఏపి ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహనరెడ్డి పచ్చజెండా ఇచ్చినట్లు తెలుస్తుంది. ఇప్పటికే మనకున్న సమాచారం ప్రకారం: పలుకీలక నామినేటెడ్ పదవులకు కొందరి పేర్లను సీఎం జగన్ ఖరారు చేసినట్లు తెలుస్తోంది.
వైసీపి ఫైర్ బ్రాండ్, నగరి శాసనసభ్యురాలు ఆర్కె రోజాకు ఏపీఐఐసి ఛైర్మన్ పదవి ఇవ్వటం దాదాపు నిశ్చయం చేశారని తెలుస్తోంది.
వైసీపి ఆవిర్భావం నుంచి కీలక రాజకీయ నేతగా, అధికార ప్రతినిధిగా ఉన్న వాసిరెడ్డి పద్మకు కూడా కీలక పదవి మహిళా కమిషన్ ఛైర్-పర్సన్గా నియమించే ఉద్దేశంలో ఉన్నట్లు తెలుస్తుంది.
మరోవైపు వైసీపికి లీగల్ బాక్-బోన్ గా నిలిచి న్యాయస్థనాల్లో విజయాలనే కాదు పార్టీకి ఆత్మబలం సమకూర్చిన మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డిని సీఆర్డీఏ చైర్మన్ పదవి లో కూర్చోబెట్టే యోచన చేస్తున్నట్లు తెలుస్తుంది. ఆయన రాజధాని భూములపై అందులోని అక్రమాలపై అలుపెరగని పోరాటం చేసిన విషయం అందరికీ తెలిసిందే – జగన్ ఇప్పటికే ఆర్కేని మంత్రిని చేస్తానని మంగళగిరి ప్రజల సమక్షంలో ఇచ్చిన మాట తప్పారు. కారణాలు ఎమైనా కావచ్చు- దీంతో అవసరమైతే వైఎస్ జగన్ మాట తప్పగలడనటానికి ఇది పెద్ద ఋజువు.
ప్రస్తుత మంత్రిమండలిలో పదవులు దక్కక, అసంతృప్తులకు అందునా ఎన్నికల సమయంలోనూ పార్టీ ఆవిర్భావం నుండి పార్టీకి కీలక సేవలు చేసిన వారికి కూడా కొన్ని పదవులు కట్టబెట్టనున్నారని జనాంతీం.
మంత్రిమండలి ఏర్పాటులో సామాజికవర్గ సమీకరణాల ప్రాధమ్యత వలన ఆర్కే రోజా, ఆళ్ల రామకృష్ణారెడ్డి మంత్రిగా ఎంపిక అయ్యే అవకాశం పోగొట్టుకున్నారు. ఇకపోతే తొలి నుండీ సినీ రంగం నుండే కాకుండా, పార్టీ పరంగా, వ్యక్తిగతంగా వైఎస్ జగన్ కు నైతిక మద్దతునిస్తూన్న కీలక నేత సినీనటుడు మోహన్ బాబుకు కూడా ఫిల్మ్ డెవలప్ -మెంట్ కార్పోరేషన్ ఛైర్మన్గా అవ కాశం ఇవ్వనున్న సమాచారముంది. తెదేపా హయాంలో ఈ పదవిని అంబికా కృష్ణ నిర్వహించి పదవికి రాజీనామాచేసి తెదేపాకి విడాకులిచ్చి ఇటీవలే బీజేపీలో చేరిపోయారు.
ఇంకా అధికారంలో లేనప్పుడు వైసీపికి అత్యంత దక్షతతో సర్వవేళలా సహకారం ఇచ్చిన కీలక నేతలు అంబటి రాంబాబు, గ్రంధి శ్రీనివాస్, కొత్తపల్లి సుబ్బారాయుడు, ద్రోణంరాజు శ్రీనివాస్, యేసురత్నం, ఆమంచి కృష్ణమోహన్, మోషేన్ రాజు, మహ్మద్ ముస్తఫా ఇంకా భూమన కరుణాకర్ రెడ్డి – ఆసక్తిగా తమ అవకాశాలకోసం ఎదురు చూస్తున్నారు.
వీరికోసం కాపు కార్పోరేషన్, బ్రాహ్మణ కార్పోరేషన్, పోలీస్ హౌసింగ్ కార్పోరేషన్, సివిల్ సప్లయిస్ కమిషన్, ఎస్సీ కమిషన్, వక్ఫ్- బోర్డు మరియు ప్రాంతీయ బోర్డుల చైర్మన్ పదవులు సిద్ధంగా ఉన్నాయి. వారి వారి అర్హతలు కులాలు మతాల అధారంగా పందేరం చేయనున్నారట. స్పూర్తిమంతమైన సంక్షేమపథకాలతో దేశంలోనే ఘనుడన్న కీర్తిప్రతిష్టలు ఘడించిన దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డి జయంతి ఈ పంపకాలకు ముహూర్తం కానుందని అభిఙ్జవర్గాల కథనం.