ఏపీలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైసిపి ఘన విజయం నమోదు చేసింది. ఈ క్రమంలోనే విపక్ష టిడిపి కి చెందిన పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఇతర నేతలు తమ రాజకీయ భవిష్యత్తు కోసం ఇతర పార్టీల్లోకి జంప్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే రాజ్యసభ సభ్యులతో పాటు ఎన్నికల్లో ఓడినా కొందరు కీలక నేతలు బిజెపి గూటికి చేరిపోయారు. ఈ క్రమంలోనే ఎన్నికలకు ముందు వరకు టిడిపిలో ఉన్న ఇద్దరు అన్నదమ్ములు విచిత్రంగా ఎన్నికల తర్వాత చెరో పార్టీలోకి జంప్ చేసేశారు. పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు మాజీ ఎమ్మెల్యే అంబికా కృష్ణ ఎన్నికల తర్వాత బిజెపిలో చేరారు.
1999లో ఏలూరులో టీడీపీ నుంచి ఆయన ఎమ్మెల్యేగా విజయం సాధించారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో ఆయన ఫిల్మ్ డవలప్ మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా పనిచేయడమే కాకుండా, పార్టీలో సీనియర్ నాయకుడిగా ఉన్నారు. టీడీపీ ఓటమితో అన్నదమ్ములు ఇద్దరిది చేరోదారి అయ్యింది. అన్న కృష్ణ బిజెపి లో చేరితే ఆయన సోదరుడు అంబికా సంస్థల అధినేత అంబికా రాజా వైసీపీలో చేరారు. ఏలూరులో డిప్యూటీ సీఎం ఆళ్ల నాని సమక్షంలో వైసీపీలో చేరిపోయారు.
ఈ సందర్భంగా ఆళ్ల నాని మాట్లాడుతూ పేద వైశ్యుల కోసం అంబికా రాజా ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారని కొనియాడారు. ఇక ఏలూరు మేయర్ గా ఉన్నా నూర్జహాన్ పెదబాబు దంపతులు ఎన్నికలకు ముందే టిడిపిని వీడి వైసీపీలో చేరి పోయారు. ఇప్పుడు అంబికా రాజా కూడా వైసీపీలో చేరారు. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏలూరు నియోజకవర్గంలో టిడిపిని పూర్తిగా స్మాష్ చేసే క్రమంలోనే ఆ నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఉన్న డిప్యూటీ సీఎం ఆళ్ల నాని ఆపరేషన్ ఆకర్ష్ తెరలేపి టిడిపి నేతలను భారీ ఎత్తున వైసీపీలో చేర్చుకుంటున్నారు. ఏదేమైనా పార్టీలో కీలకంగా ఉన్న ఇద్దరు అన్నదమ్ములు టీడీపీని వీడడం చంద్రబాబుకు పెద్ద షాకే.