ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పెద్ద మనసు చాటుకున్నారు. తన తండ్రి, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డితో పాటూ హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోయిన ఐఏఎస్ అధికారి సుబ్రహ్మణ్యం కుటుంబానికి అండగా నిలిచారు. సుబ్రహ్మణ్యం కుమార్తెకు ఉద్యోగం కల్పించారు. కారుణ్య నియామకం కింద సింధు సుబ్రహ్మణ్యంకు గ్రూప్-1 పోస్ట్‌‌లో.. డిప్యూటీ కలెక్టర్‌గా నియమించారు.

 

ఈ మేరకు ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 2017లో సుబ్రహ్మణ్యం కుమార్తె సింధు ఏపీ ప్రభుత్వానికి ఓ విన్నపం చేశారు. తనకు ఉద్యోగ అవకాశం కల్పించాలని కోరారు. ఆ వినతిని అప్పటి ప్రభుత్వం పరిశీలనలోకి తీసుకున్నా.. ఉద్యోగానికి సంబంధించి నిర్ణయం తీసుకోలేదు.

 

ఇప్పుడు సీఎం వైఎస్ జగన్ సుబ్రహ్మణ్యం కుటుంబానికి అండగా నిలిచారు. సింధు డిగ్రీ హోల్డర్ కావడంతో.. ఆమె చదువుకు తగ్గట్లుగా గ్రూప్-1 ఉద్యోగం కల్పించారు. కారుణ్య నియామకం కింద ఆమెకు ఉద్యోగ అవకాశం ఇచ్చారు. ప్రత్యేక కేసు కింద పరిగణిస్తూ ఆమెకు.. ఏపీ సివిల్ సర్వీసెస్ ఎగ్జిక్యూటివ్ విభాగంలో ఉద్యోగం ఇస్తున్నట్టు ఏపీ ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది.

 

2009 సెప్టెంబరు 2న అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌‌రెడ్డి రచ్చబండ కార్యక్రమంలో పాల్గొనేందుకు హెలికాప్టర్‌లో బయల్దేరారు. మార్గ మధ్యలో కర్నూలు జిల్లా బండి ఆత్మకూరు సమీపంలోని పావురాల గుట్ట దగ్గర వైఎస్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్‌ ప్రమాదానికి గురికావడంతో వైఎస్‌తో పాటూ ఐఏఎస్ అధికారి సుబ్రహ్మణ్యం, భద్రతాధికారి వెస్లీతో పాటూ పైలెట్లు దుర్మణం చెందిన సంగతి తెలిసిందే.


మరింత సమాచారం తెలుసుకోండి: