తెలుగు రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ జెండా ఎగరేద్దామని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. ఇక్కడ రాబోయే ప్రభుత్వాలు మనవే కావాలని, అందరూ గట్టిగా సంకల్పిస్తే ఇది సాధ్యమేనని చెప్పారు. ఇటీవల పార్లమెంటు ఎన్నికల్లో తెలంగాణలో సాధించిన 4 స్థానాలే పునాదిగా.. రాష్ట్రంలో అధికారం చేజిక్కించుకునేంత వరకూ విశ్రమించరాదని పిలుపునిచ్చారు.

 

హైదరాబాద్‌లో శనివారం జరిగిన పార్టీ సభ్యత్వ నమోదు ప్రారంభ కార్యక్రమం, కోర్‌కమిటీ సమావేశాల్లో అమిత్‌షా మాట్లాడారు. ‘‘తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌, కేరళ రాష్ట్రాల్లో వచ్చే ఎన్నికల్లో భాజపా గెలుపుబాట పట్టాలి. తెలంగాణలో అతిపెద్ద పార్టీగా భవిష్యత్తులో అవతరించడం ఖాయం. భాజపాకు మణిపూర్‌లో 1.43 శాతం, అసోంలో 4.5 శాతం ఓట్లే ఉండేవి.

 

ఆ రాష్ట్రాల్లో అధికారంలోకి వచ్చాం. పశ్చిమబెంగాల్‌లో ఓట్ల శాతాన్ని 4 నుంచి 40కి పెంచుకున్నాం. లోక్‌సభ ఎన్నికల్లో తెలంగాణలో భాజపాకు 20 శాతం ఓట్లు వచ్చాయి. 2023 ఎన్నికల్లో 50 శాతం ఓట్లు, మూడింట రెండొంతులు మెజార్టీ (80 సీట్లు) సాధించి, తెలంగాణలో పాగా వేయాల్సిందే. తెలంగాణలో సభ్యత్వం 20 లక్షలు చేయాలి. మీవల్ల కాకపోతే చెప్పండి.. నేనే వచ్చి ప్రతి జిల్లా కేంద్రంలో సమావేశం పెడతా.

 

కొత్త సభ్యులను పార్టీలో చేరుస్తా. మొన్నటి ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు. రాష్ట్రంలోనూ ఆ పార్టీ బలహీనంగా మారుతోంది. తెలుగుదేశానిదీ ఇదే పరిస్థితి. తెలంగాణలో తెరాసకు మనమే ప్రత్యామ్నాయం’’ అని అమిత్‌షా పేర్కొన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: