రైతు భరోసా పథకం కింద 54 లక్షల మంది రైతుల కుటుంబాలకు రూ.8750 కోట్లు పెట్టుబడి సాయం అందిస్తామని ముఖ్యమంత్రి వై.ఎస్‌. జగన్‌మోహన్‌రెడ్డి  ప్రకటించారు. దీని ద్వారా  15.36 లక్షల మంది కౌలు రైతులు కూడా ప్రయోజనం పొందుతారని పేర్కొన్నారు.

 

ఈ పథకం కింద అక్టోబరు 15 నుంచి ప్రతి రైతు కుటుంబానికి ఏడాదికి రూ.12,500 చొప్పున అందిస్తామని అన్నారు. రైతుల అప్పు తీర్చుకోటానికి ఈ సొమ్మును బ్యాంకులు జమ చేసుకునే వీలు లేకుండా వారి చేతికే సొమ్ము ఇస్తామని చెప్పారు.

 

2020 మే నుంచి ఈ పథకాన్ని అమలు చేస్తామని ఎన్నికల ప్రణాళికలో పేర్కొన్నా, గత అయిదేళ్లలో రైతుల పడిన కష్టాలను దృష్టిలో పెట్టుకుని గడువు కంటే ముందే అమలు చేస్తున్నామని చెప్పారు.  ఒకే విడతలో రైతుల చేతికి ఇంత మొత్తాన్ని అందించటం దేశ చరిత్రలోనే రికార్డుని అన్నారు.

 

వై.ఎస్‌.రాజశేఖర్‌రెడ్డి జయంతిని పురస్కరించుకుని సోమవారం రాష్ట్రవ్యాప్తంగా రైతు దినోత్సవం నిర్వహిస్తున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి రైతులకు ఆదివారం బహిరంగ లేఖ రాశారు. ముఖ్యంగా తుపానులు, ఇతర ప్రకృతి వైపరీత్యాల్లో నష్టపోయిన రైతులను ఆదుకునేందుకు రూ.2 వేల కోట్లతో విపత్తు సహాయ నిధి ఏర్పాటు చేస్తున్నాం. అన్నట్టు పేర్కొన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: