ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని ప్రస్తుతం ఢీకొట్టడం అంత ఆషామాషీ వ్యవహారం కాదని భావిస్తోన్న తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు , జనసేనాని పవన్ కళ్యాణ్ సహకారంతో వైకాపా ప్రభుత్వాన్ని ఇరుకునపెట్టవచ్చని భావిస్తున్నారు . ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాల్లో సామాజిక వర్గాల పాత్ర క్రియాశీలకం కావడంతో , కమ్మ, కాపు వర్గాల దన్నుతో రెడ్డి వర్గాన్ని ఢీకొట్టడం పెద్ద కష్టమేమి కాదన్న అభిప్రాయం ఆయన ఉన్నట్లు తెలుస్తోంది .
దానికి అనుగుణంగానే బాబు వ్యూహాన్ని అమలు చేసే పని లో ఉన్నారు కొంతమంది టీడీపీ నేతలు. తమ వ్యూహాన్ని అమలు చేసేందుకు వారు అమెరికా లో జరుగుతోన్న తానా సభలను వేదిక చేసుకున్నారు . చంద్రబాబు వ్యూహాన్ని పలువురు తెలుగుదేశం సానుభూతిపరులు పవన్ చెవిన వేసినట్లుగా తెలుస్తోంది. దీంతో జనసేనాని కాస్త మెత్తబడినట్లుగానే కనిపిస్తోంది.తానా సభల వేదిక పై జనసేనాని తన ప్రసంగంలో జగన్ను డైరెక్ట్గా కార్నర్ చేయగా... చంద్రబాబును పల్లెత్తు మాట కూడా అనకపోవడం గమనార్హం. ఈ పరిణామాల గమనిస్తే రాష్ట్రం లో కమ్మ, కాపులు ఏకమై రెడ్లపై పోరాటం సాగించే సూచనలు కనిపిస్తున్నాయని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు .
వైఎస్ జగన్ నేతృత్వంలో ఏర్పడిన కొత్త ప్రభుత్వం కేసులు, నోటీసులు, కూల్చివేతలు, ఎంక్వైరీలతో టీడీపీ పార్టీలోని పెద్ద తలకాయలపై గురి పెట్టడం , ఆ పార్టీ నాయకత్వం జీర్ణించుకోలేకపోతోంది . ఈ పరిస్థితుల్లో తాము ఒంటరిగా వైకాపా ప్రభుత్వం పై పోరాటం చేస్తే పెద్దగా ప్రయోజనం ఉండకపోవచ్చునని భావిస్తోంది . అందుకే పాత మిత్రుడైన పవన్ ను కలుపుకుని పోరాటం చేస్తే , ప్రజల్లో ఎంతో, కొంత ఆదరణ లభించడంతో పాటు , కుల రాజకీయ సమీకరణాలు కూడా కలిసి వచ్చే అవకాశాలున్నాయని టీడీపీ నాయకత్వం అంచనా వేస్తున్నట్లు తెలుస్తోంది .