జగన్ అధికారంలోకి వచ్చిన తరువాత ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారో అందరికి తెలిసిందే. జగన్ తీసుకునే నిర్ణయాలు ఒక్కోసారి షాక్ ఇస్తుంటాయి. అధికారంలోకి వచ్సిన వెంటనే జగన్ పింఛన్, రైతు భరోసా, అమ్మఒడి వంటి పధకాలు ప్రకటించారు.
వీటితో పాటు గత ప్రభుత్వం చేసిన అక్రమాలపైన దృష్టి పెట్టారు. ప్రత్యేక హోదా తెస్తామని చెప్పిన తెలుగుదేశం పార్టీ ఆ విషయంలో ఘోరంగా ఓడిపోయిందని, హోదాను పక్కన పెట్టిందని ఎన్నికల ప్రచారంలో చెప్పిన జగన్, తమను గెలిపించి 25మంది ఎంపీలను పార్లమెంట్ కు పంపితే.. కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదా తెస్తామని అన్నారు.
అనుకున్నట్టుగానే 22 మంది అభ్యర్థులు ఎంపీలుగా గెలిచారు. విచిత్రం ఏమంటే... కేంద్రంలో మళ్ళీ బీజేపీనే వచ్చింది. ఎవరి మద్దతు అవసరం లేకుండా బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఇది వైకాపాకు మింగుడు పడలేదు. ఇప్పుడు ప్రత్యేక హోదా గురించి అడగటమే తప్పించి గట్టిగా నిలదీసే పరిస్థితి లేకుండా పోయింది.
ఇది వేరే విషయం అనుకోండి.. జగన్ అధికారంలోకి వచ్చాక ఇసుక అక్రమాలను అడ్డుకోవడానికి ఇసుక తవ్వకాలను నిలిపేసింది. దీంతో ఆంధ్రప్రదేశ్ లో నిర్మాణ రంగం కుదేలయింది. ఇన్వెస్టర్లు ఈ రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావడం లేదు. వేలాది మంది కూలీలు ఉపాధిని కోల్పోయి రోడ్డున పడుతున్నారు. జగన్ ఒక్కసారి వారివైపు చూసి ఆ రంగంలో పనులు స్పీడ్ గా జరిగే విధంగా ప్లాన్ చేస్తే బాగుంటుంది.