గోదావరిలో ప్రస్తుతం కాఫర్డ్యామ్ నిర్మాణం మూడు రీచ్లుగా సాగుతోంది. దీనిలో మొదటిరీచ్ను 200మీటర్ల పొడవుకుగాను 18 మీటర్లు నిర్మించారు. రెండోరీచ్లో 1400 మీటర్ల పొడవున 35మీటర్ల ఎత్తులో నిర్మించారు. మూడోరీచ్ 300 మీటర్ల పొడువు ఖాళీగా ఉంది. ఇప్పుడు అంగులూరు-గొందూరు మధ్యలో నిర్మితమవుతున్న రెండో రీచ్ కారణంగానే ప్రమాదం పొంచి ఉంది. గత వరదల్లో 28లక్షల క్యూసెక్కుల నీరు గోదావరి నుంచి సముద్రంలో కలిసిపోయింది.
పోలవరం ఎగువ కాఫర్ డ్యామ్ పనులు గత నెలలోనే ఆగిపోయాయి. పోలవరం ప్రాజెక్టు అథారిటీ ఆదేశాల మేరకు ఈ పనులు ఆపేశారు. ఉభయ గోదావరి జిల్లాల్లోని పోలవరం, దేవీపట్నం మండలాల మధ్య గోదావరిలో నిర్మించనున్న ఎర్త్ కమ్ రాక్ఫిల్ డ్యామ్ నిర్మాణం కోసం, దానికి ఎగువ, దిగువ భాగాల్లో కాఫర్ డ్యామ్లు నిర్మాణం చేపట్టారు. ఈ జూలైలోనే గ్రావెటీ ద్వారా నీరు ఇవ్వాలనే లక్ష్యంతో గత ప్రభుత్వం ఎగువ కాఫర్ డ్యామ్ పనులు వేగవంతం చేసింది. 2.47 కిలోమీటర్ల పొడవు లక్ష్యంగా పెట్టుకుని రెండు కరకట్టల మధ్య దీని నిర్మాణం చేపట్టారు.
ప్రస్తుతం పోలవరం ప్రాజెక్టు వద్ద గోదావరి ఉధృతి పెరుగుతుంది. ఎగువ నుంచి వరదనీరు ఎక్కువగా ఉండటంతో కాఫర్ డ్యామ్కు వెళ్లే అప్రోచ్ రోడ్డు మునిగిపోయింది. అప్రోచ్ రోడ్డుపై నుంచి గోదావరి వరద నీరు ప్రవహిస్తుంది. ప్రాజెక్టు వద్ద 600 మీటర్ల వెడల్పు మేర గోదావరి నీరు ప్రవహిస్తుంది. అక్కడ మొత్తం గోదావరి వెడల్పు 2400 మీటర్లు కాగా, ఇప్పటికే 2200 మీటర్ల మేర నదిని కాఫర్ డ్యామ్ నిర్మాణంతో అధికారులు మూసివేశారు. దీంతో ఖాళీగా కొద్ది భాగం నుంచే వరద నీరు కిందకి వెళుతుంది.
గతనెల వరకూ 1.700 కిలోమీటర్ల మేర నిర్మించారు. ఇంతలో ఈ పనులు ఆపేయమని పీపీఏ ఆదేశించడంతో పనులు ఆగిపోయాయి. దీని తర్వాత పూర్తి చేస్తారా ? లేదా ? అనేది స్పష్టత లేదు. ప్రస్తుతం వరదలవల్ల ఇంత వరకూ నిర్మించిన కాఫర్డ్యామ్ దెబ్బ తినకుండా పీపీవో ఓ డిజైన్ ఇచ్చింది. దీని ప్రకారం రక్షణ చర్యలు చేపట్టారు. మరో వారం రోజుల్లో ఇవి పూర్తి కావచ్చని చెబుతున్నారు.