ఏపీలో టీడీపీ యువనేత మాజీ మంత్రి లోకేష్ సీఎం జగన్మోహన్ రెడ్డితో పాటు... వైసిపి ప్రభుత్వ పాలనను టార్గెట్ గా చేసుకుని ట్వీట్టర్ వేదికగా విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే. ట్విట్టర్ లో తమపై లోకేష్ చేస్తున్న దాడికి కౌంటర్గా వైసీపీకి చెందిన రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డితో పాటు పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కౌంటర్ ఎటాక్ కూడా చేస్తున్నారు. గత పక్షం రోజులుగా ఏపీలో అధికార వైసిపి వర్సెస్ విపక్ష టిడిపి మధ్య సోషల్ మీడియాలో పెద్ద యుద్ధమే జరుగుతోంది.
ఇదిలా ఉంటే ఈ క్రమంలోనే లోకేష్ కు ప్రకాశం జిల్లా సంతనూతలపాడు ఎమ్మెల్యే టీజేఆర్. సుధాకర బాబు సవాల్ విసిరారు. జగన్ పాలన చూసి లోకేష్ భయపడుతున్నాడు. టిడిపి ప్రభుత్వంలో ఉన్న అవినీతిని తమపై తోసేయాలని లోకేష్ చూస్తున్నారని మండిపడ్డారు. ఈ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ ప్రజలు చంద్రబాబు, లోకేష్ ను తిరస్కరించిన వాళ్లకు ఇంకా బుద్ధి రాలేదని విమర్శించారు. జగన్ విజయాన్ని చూసి లోకేష్ ఓర్వలేకపోతున్నాడన్న సుధాకర్ బాబు... లోకేష్ ప్రభుత్వంపై విమర్శలు చేసే ముందు దయ చేసి తెలుగు నేర్చుకోవాలని సూచించారు.
తెలుగులో నాలుగు పదాలు సరిగ్గా పలకలేని వ్యక్తి ముఖ్యమంత్రిపై విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. లోకేష్ ప్రెస్ మీట్ పెట్టి గుంటూరు - మంగళగిరి - డెంగ్యూ పదాలను స్పష్టంగా తప్పు లేకుండా పలకాలని సవాల్ విసిరారు. ప్రెస్ మీట్ పెట్టి ఈ మూడు పదాలను సరిగా పలికితే చంద్రబాబుకు నిజమైన రాజకీయ వారసుడిగా ఒప్పుకుంటామని ఆయన స్పష్టం చేశారు.
ఏదేమైనా వైసీపీ నెలన్న రోజుల పాలనపై అప్పుడే టీడీపీ నేతలు సోషల్ మీడియాలో భారీగా టార్గెట్గా చేసుకుని విరుచుకుపడుతున్నారు. అటు టీడీపీ సోషల్ మీడియా విభాగం కూడా అప్పుడే జగన్, వైసీపీ ప్రభుత్వాన్ని ఓ రేంజులో టార్గెట్ చేస్తోంది. ఈ క్రమంలోనే వైసీపీ వాళ్లు ఇప్పుడు లోకేష్ను గట్టిగా టార్గెట్గా చేసుకుని కౌంటర్లు ఇస్తున్నారు.