గతంలో కొత్త ఎంపీలకు ఫైవ్ స్టార్ హోటల్స్ లో ఎక్కువగా బస ఏర్పాటు చేసేవారు. సర్కార్ ఫ్లాట్ దొరికేంతవరకు కొత్త ఎంపీలు అక్కడే కాలక్షేపం చేసేవారు. అయితే ఇలా ఫైవ్ స్టార్ హోటల్స్ లో అకామడేషన్ ఏర్పాటు చేయడం తో సర్కార్ కు హోటల్ బిల్లులు తడిసి మోపెడయ్యాయి. దీంతో ఈ పద్దతికి ఫుల్ స్టాప్ పెట్టి ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన భవన్స్ లోనూ, మిగతా చోట్ల వసతి ఏర్పాటు చేయడం మొదలెట్టింది. దీంతో సర్కార్ కు ఖర్చు తగ్గింది. వెస్ట్రన్ కోర్టుకు కొనసాగింపుగా మరో కొత్త బిల్డింగ్ ను కిందటేడాది కేంద్రం నిర్మించింది. ఇందులో ప్రస్తుతం 88 మంది కొత్త ఎంపీలు ఉంటున్నారు. మరో 20 మందికి వెస్ట్రన్ కోర్టు బిల్డింగ్ లో నివాసం ఏర్పాటు చేశారు అధికారులు.
రెండు నెలల క్రితం జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో గెలిచి లోక్ సభలోకి అడుగుపెట్టడం ఎంత కష్టమో ఢిల్లీలో ఉండటానికి సర్కార్ ఫ్లాట్ సాధించడం అంతకంటే కష్టం అంటున్నారు నూతనంగా ఎన్నికైన ఎంపీలు. ఈసారి 267 మంది కొత్తగా లోక్ సభ కు ఎన్నికయ్యారు. ప్రస్తుతం లోక్ సభ సమావేశాలు జరుగుతున్నాయి. దీంతో చాలా మంది కొత్తగా ఎన్నికైన ఎంపీలు వారి వారి రాష్ట్రాలకు చెందిన భవన్స్, అలాగే వెస్ట్రన్ కోర్ట్ బిల్డింగ్ లో వారికి కెటాయించిన గదుల్లో ఉంటున్నారు. ప్రతి రోజు అక్కడి నుంచే లోక్ సభ సమావేశాలకు హాజరవుతున్నారు. ఎంపీలుగా ఎన్నికైన వారికి ఢిల్లీలో ఉండటానికి ప్రభుత్వం నివాసం కేటాయిస్తుంది. ఎవరికి ఎక్కడ నివాసం కేటాయించాలన్న వ్యవహారాలను లోక్ సభ, రాజ్యసభలకు చెందిన హౌస్ కమిటీలు చూసుకుంటాయి.
దీంతో ఈ హౌస్ కమిటీలకు కొత్త ఎంపీలు క్యూ కడుతున్నారు. సాధ్యమైనంత త్వరగా తమకు ఉండటానికి ఓ మంచి ఫ్లాట్ కేటాయించాలని కోరుతున్నారు. ఎక్కువ మంది ఎక్కడో ఒక చోట ఫ్లాట్ కేటాయిస్తే చాలంటున్నారు. అయితే కొంతమంది మాత్రం ఫలానా ఏరియాలోనే నివాసాన్ని కేటాయించాలని రిక్వెస్ట్ చేస్తున్నారు. పశ్చిమ బెంగాల్ నుంచి ఫస్ట్ టైమ్ లోక్ సభకు ఎన్నికైన సుభాష్ సర్కార్ మంచి ప్రాక్టీస్ ఉన్నడాక్టర్. దీంతో రామ్ మనోహర్ లోహియా ఆస్పత్రికి దగ్గరలో తనకు అకామడేషన్ ఇవ్వాలని హౌస్ కమిటీని కోరారు. వైద్య పరంగా ఆసుపత్రి పక్కనె ఉండటంతో తనను కలవడానికి వచ్చే ప్రజలను అక్కడ వైద్యం చేయించుకుంటారని తెలిపారు. ప్రస్తుతం సుభాస్ సర్కార్ బంగ్లా భవనంలోఉంటున్నారు.
ఇక్కడ మరో చిక్కు ఏమిటంటే ప్రస్తుతం నూతనంగా ఎన్నికైన ఎంపీలకు కనీసం ఒక్క గది కూడా దొరకడం లేదు. దీనికి కారణం మాజీ ఎంపీలు ఇప్పటి వరకు వారికి కెటాయించిన గవర్నమెంట్ ప్లాట్లను ఖాళీ చేయకపోవడమే.... దీంతో కొత్త ఎంపీలు కొన్ని నెలల పాటు ఎదురుచూడాల్సిన పరిస్థితి. ప్రభుత్వం వైపు నుంచి ఎంతో ఒత్తిడి వస్తే కానీ సాధారణంగా వీరు గవర్నమెంట్ ఫ్లాట్స్ ను ఖాళీ చేయరు. అప్పటివరకు కొత్త ఎంపీలకు ఎక్కడో ఓ చోట టెంపరరీగా అకామడేషన్ ఏర్పాటు చేస్తారు లోక్ సభ సెక్రటేరియట్ కు చెందిన అధికారులు.
తొలిసారి ఎంపీలుగా ఎన్నికైన వారందరికీ సహజంగా ‘ టైప్ –5 ’ ఫ్లాట్స్ అలాట్ చేస్తారు. ఇలా తొలిసారి ఎంపీ అయిన లీడర్ గతంలో వారి రాష్ట్రాల్లో మంత్రులుగా పనిచేసినా లేదా అక్కడ ఎమ్మెల్యేగా పనిచేసి ఉన్నా ‘ టైప్ – 6 ’ ఫ్లాట్స్ కేటాయించే అవకాశాలున్నాయి. మొత్తానికి సర్కార్ ఫ్లాట్స్ దొరకగానే వాటిలోకి షిఫ్ట్ కావడానికి కొత్త ఎంపీలు రెడీగా ఉన్నారు.