ఏపీ సీఎంగా జగన్ తీసుకున్న నిర్ణయాలు, వేస్తున్న అడుగులకు ప్రజల నుంచి మంచి స్పందన లభిస్తోంది. ఆయనకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. ముఖ్యంగా గుంటూరు జిల్లా తాడేపల్లిలో నిర్మించిన ప్రజావేదికను అక్రమంగా గుర్తిం చిన జగన్ ప్రభుత్వం.. వెంటనే దానిని తొలగించింది. నదీపరివాహక ప్రాంతాల అభివృద్ధి, పరిరక్షణ చట్టం కింద జగన్ చర్యలు తీసుకున్నారు. జగన్ నిర్ణయాన్ని ప్రజలు స్వాగతించారు. అక్రమాలను కూల్చేయాలని సోషల్ మీడియాలో ఎలుగెత్తారు.
ఇక, ఆ తర్వాత ఎఫెక్ట్.. అదే నదీ పరివాహక ప్రాంతంలో మాజీ సీఎం చంద్రబాబు నివసిస్తున్న భవనంపై పడింది. ఇది కూడా నదీ చట్టాలకు వ్యతిరేకంగా నిర్మించిందే కావడంతో జగన్ దీనిని తొలగించేందుకు రెడీ అయ్యారు. ప్రస్తుతం ఇది కోర్టు పరిధిలో ఉండడంతో రెండు వారాల సమయంలో పట్టనుంది. అయితే, దీనిపై తాజాగా అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సమయంలో టీడీపీ సభ్యుడు నిమ్మల రామానాయుడు దీనిపై ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. అక్రమ కట్టడాల ను తొలగించేందుకు ప్రబుత్వం నడుం బిగించిందని సాక్షాత్తూ సీఎం జగన్ ప్రకటించారు.
ఇక, దీనిపైనే తాను కూడా మాట్లాడేందుకు రెడీ అయిన ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు.. అడ్డంగా దొరికి పోయారు. నదీ పరివాహక చట్టాలను తన ప్రభుత్వంలో తనే మార్చుకుని, కృష్ణానది వరద కు అడ్డు పడ్డారని అధికార పక్షం దుమ్మెత్తి పోసింది. తాను అన్ని అనుమతులు, నిబంధనలు పాటించే సదరు ప్రజావేదికను నిర్మించానని బాబు చెప్పడంతో జగన్ దీనిపై చెలరేగిపోయారు. ఈ నేపథ్యంలోనే చంద్రబాబు మాట్లాడుతూ.. జగన్ ప్రభుత్వం తీసుకున్న అక్రమ కట్టడాల తొలగింపు వ్యవహారం రాష్ట్రం లోని పేదలకు కంటిపై కునుకు లేకుండా చేస్తోందని అన్నారు. ప్రజలను భయ భ్రాంతులకు గురి చేస్తోందని చెప్పారు. అదేసమయంలో నిబంధనలు పాటించే ప్రభుత్వం రోడ్లపై మధ్యలో ఉన్న విగ్రహాలను కూడా తొలగించాలని వీటి వల్ల కూడా ప్రాణాలు కోల్పోతున్నాయని ప్రశ్నోత్తరాల సమయంలో చర్చకు తెరదీసి.. వివాదానికి కారణమయ్యారు.
ఈ నేపథ్యంలో వైసీపీ నుంచి బలమైన ప్రతిఘటన ఎదురైంది. అంటే.. రోడ్ల మధ్యలోని అంబేద్కర్ విగ్రహాలను తొలగించాలని చంద్రబాబు భావిస్తున్నారా? అంటూ.. పెద్ద ఎత్తున ఆయనపై వైసీపీ పక్షం దుమ్మెత్తి పోసింది. దీంతో సభ అదుపు తప్పింది. నినాదాలు, ప్రతినినాదాలతో హోరెత్తి పోయింది. ఏదేమైనా.. ఒక విషయంపై ప్రశ్నోత్తరాలు జరిగినప్పుడు దానిని పక్కకు పెట్టి మరో అనుబంధ విషయాన్ని తీసుకోవడం బాబుకు సరైంది కాదని స్వయంగా స్పీకర్ హెచ్చరించడం గమనార్హం.