విజయవాడ సెంట్రల్ మాజీ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు టీడీపీకి టాటా చెప్పి బీజేపీ లేదా వైసీపీ తీర్థం పుచ్చుకుంటారని కొద్ది రోజులుగా పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి. ఇందుకు బొండా తీరు కూడా అనేక సందేహాలు రేకెత్తిచింది. ఎన్నికల్లో ఓడిపోయాక టీడీపీ కాపు నేతలు పెట్టుకున్న సమావేశానికి ఆయన డుమ్మా కొట్టారు. ఆ తర్వాత ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లిన ఆయన్ను అక్కడ టీడీపీ హార్ట్కోర్ ఫ్యాన్స్ ఓ సమావేశం పెట్టుకుని ఇన్వైట్ చేస్తే బొండా ఆ మీటింగ్కు రానని తిరస్కరించారు.
ఇక బొండా తీరుపై అనుమానాలతో ఉన్న పార్టీ అధిష్టానం కూడా ఆయన పార్టీ మారితే సెంట్రల్ నియోజకవర్గ టీడీపీ పగ్గాలు ఎవరికి అప్పగిస్తే మంచిదని కూడా నేరుగా ఆ నియోజకవర్గ నేతలకే ఫోన్లు చేసి ఆరా తీశారు. దీంతో అధిష్టానం తనను నమ్మకపోవడంతో బొండా తీవ్రంగా రగిలిపోయారు. చివరకు ఈ ఇష్యూ చంద్రబాబు వరకు వెళ్లగా... బాబు సర్దిచెప్పడంతో ఆయన కాస్త సైలెంట్ అయ్యారు.
అయినా ఈ ఇష్యూ మాత్రం నలుగుతూనే ఉంది. బొండా వైసీపీలోకి వెళితే ఆయనకు తూర్పు నియోజకవర్గ పగ్గాలు ఇస్తారని అన్నది బాగా ట్రెండ్ అవుతోంది. తాజాగా ఈ అంశంపై క్లారిటీ వచ్చింది. టీడీపీ కీలక నేత, ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న శనివారం సాయంత్రం బొండాతో భేటీ అయ్యారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. బొండా టీడీపీనే వీడే ప్రశక్తే లేదన్న ఆయన పార్టీ అధిష్టానం సూచన మేరకే తాను బొండాతో భేటీ అయ్యానని చెప్పారు.
బొండా పార్టీ వీడరని.. అవసరమైతే తాను విజయవాడ అర్బన్ అధ్యక్ష పదవి నుంచి తప్పుకుంటాను. ఆయన్ను స్వీకరించాల్సిందిగా నేను కోరానని కూడా చెప్పారు. బొండా టీడీపీ కష్టాల్లో ఉన్నప్పుడు పార్టీ వెంటే నడిచారని.... బొండానే కాదు ఎవరు కూడా టీడీపీ వీడే ప్రశక్తే ఉండదని బుద్ధా చెప్పారు. ఏదేమైనా బొండా అలకతో ఉన్న విషయం తెలుసుకున్న పార్టీ అధిష్టానం చివరకు బుద్ధాతో రాయభారం పంపి ఆయన్ను కూల్ చేసిందని తెలుస్తోంది.