ఏపీ సీఎంగా జగన్మోహన్రెడ్డి అలా ప్రమాణస్వీకారం చేశారో లేదో ఎన్నో సంచలన నిర్ణయాలతో పాలనా పరంగా సంస్కరణల్లో మార్పులకు శ్రీకారం చుడుతున్నారు. జగన్ తీసుకుంటోన్న ప్రతి నిర్ణయం ఓ సంచలనమే అవుతోంది. ముఖ్యంగా యువతకు భారీగా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తానని ముందే చెప్పిన జగన్ భారీ ఎత్తున నోటిఫికేషన్లు వెలువరిస్తున్నారు. ఇక వలంటీర్ల వ్యవస్థతో ఆగస్టు 15న ఏపీ చరిత్రలోనే ఏ సీఎం చేయని విధంగా సరికొత్త వ్యవస్థకు శ్రీకారం చుట్టిన జగన్ ఇక ఇప్పుడు గ్రామ సచివాలయం కోసం భారీ ఎత్తున నోటిఫికేషన్లు రిలీజ్ చేశారు.
అక్టోబర్ 2 నుంచి గ్రామ సచివాలయం ప్రారంభమయ్యేలా ఇప్పటికే కసరత్తులు జరుగుతున్నాయి. ఇప్పటకే గ్రామీణ యువతరం ఏదో ఒక ఉద్యోగంతో కాస్త ఫుల్ బిజీ అవ్వగా ఇప్పుడు వారికి మరిన్ని వరాలు సీఎం కురిపించేశారు. గ్రామ సచివాలయం పోస్టులు అంటే మామూలు విషయం కాదు. గ్రామీణ ప్రాంతాల్లో ఉంటూ మంచి జీతభత్యాలు అందుకోవడం - ప్రభుత్వ ఉద్యోగం అనే ట్యాగ్.. ఇవన్నీ యూత్ ను అట్రాక్ట్ చేస్తూ ఉన్నాయి. వెయ్యి కాదు.. రెండు వేలు కాదు ఏకంగా 30 వేల ఉద్యోగాలు ఉండడంతో యువత ఆశల పల్లకిలో ఉంది.
ఇక ఆగస్టు 15 సందర్భంగా సీఎం హోదాలో తొలిసారి జెండా ఎగరవేసిన జగన్ భవిష్యత్తులో మరిన్ని ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ ఉంటుందని చెప్పారు. త్వరలోనే రెండు లక్షలకు పైగా ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ ఉంటుందని జగన్ ప్రకటించడం గమనార్హం. రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేయడం అంటే మామూలు విషయం కాదు. అలాగని జగన్ ఏదో తూతు మంత్రంగా చెప్పేసి వదిలేస్తాడనుకోలేం.
వలంటీర్లతో పాటు గ్రామ సచివాలయం పోస్టుల ఎంపికలో ఎలా చెప్పాడో అలాగే చేసి చూపిస్తున్నాడు. చంద్రబాబు ఐదేళ్ల పాలనలో యువతకు చాలా ఆశలు కల్పించి ఒక్క ఉద్యోగం కూడా భర్తీ చేయలేదు. దీంతో వేలాదిగా ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో జగన్ చేసిన ప్రకటన ఆసక్తిదాయకంగా మారింది. అధికారం చేపట్టిన మూడు నెలల్లోనే ముప్పై వేలకు పైగా ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఇక మరో రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు అంటే యువత పండగ చేసుకోవడమే మిగిలి ఉంది.