దేశంలో ఆగష్టు 15 వ తేదీన ఎర్రకోటపై ఉదయాన్నే ప్రధాన మంత్రి జెండా ఎగురవేస్తారు. ఆ తరువాత దేశంలో అన్ని ప్రాంతాల్లో జెండా ఎగురవేయడం జరుగుతుంది. స్వతంత్రం వచ్చిన తరువాత నుంచి ఇదే ఆనవాయితీ జరుగుతున్నది. అయితే, ఒక్క చోట మాత్రం అందుకు భిన్నంగా జరుగుతుంది. అక్కడ ఆగష్టు 14 వ తేదీ అర్ధరాత్రే జెండాను ఎగురవేస్తారు. గత 25 సంవత్సరాలుగా ఇలానే అక్కడ జెండాను ఎగరవేస్తున్నారు. ఇంతకీ ఆ ప్రాంతం ఎక్కడ ఉన్నది. ఎక్కడ ఎగురవేస్తారు.. తెలుసుకుందాం.
కర్ణాటకలోని ఉడిపి జిల్లాలో ముండగిరి అనే చిన్న పట్టణం ఉన్నది. ఈ పట్టణానికి అనుకోని కనకప్ప బురుజు ఉన్నది. ఈ బురుజుపై ఆగస్టు 14 వ తేదీ అర్ధరాత్రి 12 గంటలకు జెండా ఎగురవేస్తారు.. జాతీయ గీతం ఆలపిస్తారు. మిఠాయిలు పంచుకుంటారు. ఆ తరువాత తిరిగి పట్టణానికి వెళ్ళిపోతారు. కన్నడ క్రాంతి సేన ఆధ్వర్యంలో ఈ తంతు నడుస్తుంది.
ఆగష్టు 14 వ తేదీ రాత్రి 10 గంటలకు అందరు బురుజు వద్దకు చేరుకుంటారట. అక్కడ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. సరిగ్గా 12 గంటలకు జెండా ఎగురవేస్తారు. 1995 వ సంవత్సరం నుంచి ఈ ఆనవాయితీని అలానే కొనసాగిస్తున్నారు. అర్ధరాత్రి స్వాతంత్రం వచ్చింది కాబట్టి దానికి గుర్తుగా ఇలా చేస్తున్నారట. దీన్ని తూచా తప్పకుండా ఇప్పటికి పాటిస్తున్నారు. మరుసటి రోజు పట్టణంలో అందరిలాగే తిరిగి జెండా వందన కార్యక్రమం జరుగుతుంది.
ఈ ఆనవాయితీ చాలా బాగుంది కదా. స్వాతంత్రం వచ్చింది అని చెప్పుకొని రాత్రి నిద్రపోయి తెల్లారి హడావుడిగా లేచి పరుగులు తీసే బదులుగా.. అర్ధరాత్రి నుంచి ఇలా చేయడం సెలెబ్రేట్ చేసుకుంటే ఎంత బాగుంటుంది కదా. దీన్ని చూసిన తరువాతైనా అందరు అర్ధరాత్రి నుంచే సెలెబ్రేట్ చేసుకుంటే బాగుంటుంది. ఇండియా టీం విజయం సాధించినప్పుడు రోడ్డుపైకి వెళ్లి టపాసులు కాలుస్తారు. పార్టీ గెలిచినప్పుడు రోడ్డుపై పండుగ చేసుకుంటారు. కానీ, స్వాతంత్రం వచ్చిన అర్ధరాత్రి మాత్రం అందరు కామ్ గా నిద్రపోతుంటారు.