పాపం పాకిస్థాన్... తన భూభాగంలో భాగమైన కశ్మీర్ విషయంలో భారతదేశం తీసుకున్న నిర్ణయం ఆధారంగా మనదేశాన్ని ఇరకాటంలో పడేయాలని ప్రయత్నిస్తుంటే...ప్రతి సందర్భంలోనూ చుక్కెదురు అవుతోంది. ఓవైపు అంతర్జాతీయ సమాజం మద్దతుకు ముందుకు రాకపోగా మరోవైపు ఐక్యరాజ్య సమితిలోనూ షాక్ తగిలింది. జమ్మూ కాశ్మీర్ అంశం ఇండియా- పాక్ దేశాలకు చెందిన వ్యవహారమని ఐక్యరాజ్యసమితి భద్రతామండలి స్పష్టం చేసింది. ఈ విషయంలో భద్రతామండలి కలగజేసుకోవడం సరికాదని రష్యాతేల్చిచెప్పింది.
ఐరాస భద్రతామండలి అధ్యక్షురాలు, పోలండ్కు చెందిన జువన్నా రోయెంకా నేతృత్వంలో భద్రతామండలి శుక్రవారం సమావేశమైంది. ఐదు శాశ్వత సభ్య దేశాల ప్రతినిధులు, 10 ఆహ్వానిత సభ్య దేశాల ప్రతినిధులతో అంతర్గత సంప్రదింపులు (క్లోజ్డ్ డోర్ కన్సల్టేషన్స్) జరిపింది. గంటకుపైగా సాగిన ఈ సమావేశంలో సభ్యదేశాల ప్రతినిధుల అభిప్రాయాలను తీసుకున్నారు. ఈ సమావేశం వివరాలను అధికారికంగా వెల్లడించలేదు. అయితే జమ్ముకశ్మీర్ సమస్య పూర్తిగా ద్వైపాక్షిక అంశమని, భారత్-పాక్ కలిసి చర్చించుకోవాలని నిర్ణయించినట్టు సమాచారం.
ఈ రహస్య సమావేశంలో పాకిస్తాన్కు చైనాఅండగా నిలబడగా.. శాశ్వత సభ్యత్వం ఉన్నరష్యా, బ్రిటన్, ఫ్రాన్స్, అమెరికా ప్రతినిధులుఇండియాకు మద్దతు తెలిపాయి. ఈ సమావేశంలో ఇండియాను రష్యా వెనకేసుకువచ్చింది. ఆర్టికల్370 రద్దును రష్యా స్వాగతించింది.కశ్మీర్లో పరిస్థితి ఆందోళనకరంగాఉందన్న చైనా వాదనను కొట్టిపారేసింది. మీటింగ్ తర్వాత యూఎన్లో ఇండియా ప్రతినిధి సయ్యద్ అక్బరుద్దీన్ మాట్లాడుతూ...కాశ్మీర్ అంశం పూర్తిగా ఇండియా అంతర్గత వ్యవహారమన్నారు. ఇందులో పాక్ సహా ఏ దేశమూ జోక్యం చేసుకోలేదన్నారు. రోగం వచ్చాక డాక్టర్ దగ్గరికి పరిగెత్తడం కన్నా , ముందే జాగ్రత్తపడడం మేలన్న ఉద్దేశంతో ఈ చర్య తీసుకున్నట్లు వివరించారు. 1972 ఒప్పందంతో సహా కుదుర్చుకున్న అన్ని ఒప్పందాలనూ ఇండియా గౌరవిస్తుందని, ఏ ఒప్పందాన్నీ మీరలేదని వివరించారు. ఉగ్రవాదాన్ని ఎగదోస్తూ తమ లక్ష్యాలను నెరవేర్చుకోవాలనుకోవడం ఒక దేశం లక్షణం కాదు. ఉగ్రవాదం ఉండగా చర్చలకు ఏ ప్రజాస్వామ్య దేశమూ ఒప్పుకోదు. కాబట్టి ఉగ్రవాదాన్ని ఆపి.. చర్చలకు రండి అని స్పష్టంచేశారు.