టీడీపీ అదినేత చంద్రబాబు హయాంలో ఐటీ రాజధాని అంటూ హడావుడి చేసిన విశాఖ నగరంలో ఇప్పుడు పార్టీ కుదేలైందా? నాయకులు ఎవరూ కూడా పార్టీని పట్టించుకోవడం లేదా? ఎవరికి వారే యమునాతీరే అన్నట్టుగా ఇక్కడ నాయకులు వ్యవహరి స్తున్నారా? అంటే.. తాజా పరిణామాలను గమనిస్తున్న వారు ఔననే అంటున్నారు. విషయంలోకి వెళ్తే.. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ తుడిచి పెట్టుకు పోయినా.. విశాఖలో మాత్రం నాలుగు చోట్ల అసెంబ్లీ స్థానాలను గెలుచుకుంది. అవి కూడా అన్నీ నగరంలోనే ఉన్నవి కావడం గమనార్హం.
అయితే, నాయకుల మధ్య సమన్వయం లేక పోవడంతో పార్టీని నడిపించే వారు కూడా కరువయ్యారు. తాజాగా జగన్ ప్రభుత్వ వ్యతిరేక విధానాలను ఎండగడుతూ రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టి ఉద్యమంలో విశాఖలో ఎవరికి వారుగానే కార్యక్రమాలు నిర్వహించారు. అదే సమయంలో కీలకమైన నాయకుడు మాజీ మంత్రి విశాఖ ఉత్తర ఎమ్మెల్యేగా విజయం సాధించిన గంటా శ్రీనివాసరావు ఎక్కడా కనిపించలేదు. అదేసమయంలో మాజీఅయ్యన్న పాత్రుడు తాను తప్పుకుంటానని చంద్రబాబు సమక్షంలోనే చెప్పుకొచ్చారు. మిగిలిన వారిలోనూ నగర అధ్యక్షుడు రెహ్మాన్తో పొసగక పోవడంతో ఎవరికివారుగానే కార్యక్రమాలు చేసుకుంటున్నారు.
నిజానికి ఇక్కడ నలుగురు.. గంటా శ్రీనివాసరావు, వాసుపల్లి గణేష్, వెలగపూడి రామకృష్ణబాబు, పీజీ వీర్ నాయుడు విజయం సాధించారు. వీరిలో ఏ ఒక్కరూ కూడా పార్టీని బలోపేతం చేసేందుకు కృషి చేయకపోగా.. గంటా వంటి వారు పార్టీ మారిపోతున్నారనే ప్రచారం తరచూ వినిపిస్తోంది. దీంతో ఇక్కడి శ్రేణులు డీలా పడుతున్నాయి. ఇక, తాజా ఎన్నికల్లో టీడీపీ టికెట్పై పోటీ చేసి గెలిచిన వారి పరిస్తితి ఇలా ఉంటే.. ఓడిన వారు ఇప్పటి వరకు పార్టీకార్యాలకు కూడా వచ్చిన సందర్భం ఒక్కటంటే ఒక్కటి కూడా కనిపించడం లేదు. ఇప్పటి వరకుచంద్రబాబు రెండు సార్లు.. ఓటమిపై సమీక్షలు చేశారు.
ఈ క్రమంలోనే ఆయన బంధువు, బాలయ్యకు అల్లుడు అయ్యే గీతం వర్సిటీ సీఈవో శ్రీ భరత్ విశాఖ ఎంపీగా పోటీ చేసి పరాజయం పాలయ్యారు. అయినప్పటికీ.. పార్టీ అభివృద్దికి తాను కృషి చేస్తానని ఎన్నికల అనంతరం ప్రకటించినా.. ఇప్పటి వరకు మీడియా ముఖం చూడలేదు. పార్టీ కార్యక్రమాలు ఒక్కదానికి కూడా హాజరుకాలేదు. ఇక, అయ్యన్నపాత్రుడు అప్పుడప్పుడు మీడియా ముందుకు వస్తున్నా.. తనలో అసంతృప్తిని మాత్రం దాచుకోలేక పోతున్నారు.
తాను తప్పుకొంటానని ఆయన బాహాటంగానే ఇటీవల వెల్లడించారు. ఇక, పాడేరు, అరకుల నుంచి పోటీ చేసిన ఓడిన వారు ఇప్పటి వరకు పత్తా లేకుండా పోయారు. ఎస్టీ వర్గానికి చెందిన అరకు నుంచి పోటీ చేసి ఓడిన ఆరు నెలల మాజీ మంత్రి కిడారి శ్రావణ్ కూడా ఇప్పటి వరకు బయటకు రాలేదు. ఈ పరిస్థితి చూస్తే.. విశాఖలో టీడీపీ ఇప్పట్లో పుంజుకునే పరిస్థితి లేదని అంటున్నారు పరిశీలకులు మరి ఈ నేపథ్యంలో ఏం జరుగుతుందో చూడాలి. పార్టీ ఓడినా.. ప్రతిపక్షంలో ఉన్నందున పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని చంద్రబాబ సహా అందరూ పిలుపునిస్తున్నా.. కీలకమైన జిల్లాలో నలుగురు ఎమ్మెల్యేలను పెట్టుకుని కూడా ఏమీ చేయలేని పరిస్థితి ఏర్పడడంతో పార్టీ శ్రేణులు మిన్నకుండిపోతున్నాయి.