ఇటీవలి కాలంలో తెలంగాణ సీఎం కేసీఆర్పై ఘాటు విమర్శలు చేస్తున్న తెలంగాణ కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్ పర్సన్ విజయశాంతి మరోమారు అదే రీతిలో స్పందించారు. ప్రస్తుతం జరుగుతున్న మున్సిపల్ ఎన్నికల ఫలితాలను గురించి ఆమె ఘాటు వ్యాఖ్యలు చేశారు. తన ప్రభుత్వంపై కుట్ర జరుగుతోందని చెప్పే కేసీఆర్ ..మున్సిపల్ ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడి ప్రతిపక్షాలను ఓడించాలనుకోవడం కుట్ర కాదా అని ప్రశ్నించారు. హైకోర్టులో విచారణలో మరిన్ని నిజాలు బయటకు వస్తే ప్రభుత్వ బండారం బయట పడటం ఖాయమని విజయశాంతి అన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో టీఆర్ఎస్ అక్రమాలకు పాల్పడబోతుందని ఆరోపించారు.
తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రభుత్వం ఎంత బరితెగించిందో చెప్పడానికి హైకోర్టు వ్యాఖ్యలే నిదర్శనమా అని విజయశాంతి అన్నారు. వార్డుల విభజనను కంటి తుడుపు చర్యగా హైకోర్టు ప్రస్తావించిందంటే ఇక ఎన్నికల్లో ఎన్ని అక్రమాలకు పాల్పడుతుందో చెప్పాల్సిన పనిలేదన్నారు. ఇంటర్ విద్యార్ధుల ఆత్మహత్యలపై నివేదిక ఇవ్వాలని రాష్ట్రపతి అడిగితే అది ప్రతిపక్షాల కుట్ర అంటూ కేసీఆర్ గగ్గోలు పెడుతున్నారంటూ విజయశాంతి విమర్శించారు.
ఇదిలాఉండగా, లేడి అమితాబ్గా పిలుచుకునే విజయశాంతి దాదాపు 13 ఏళ్ల తర్వాత టాలీవుడ్ లో రీ ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. ఇటు సినిమాలు అటు రాజకీయాల్లో బిజీగా ఉంటున్నారు. 2006 తెలుగులో విజయశాంతి నటించిన నాయుడమ్మ లాస్ట్ మూవీ. ఆ తర్వాత ఆమె ఇంత వరకు ఎటువంటి సినిమాల్లో యాక్ట్ చేయలేదు. లేటెస్ట్ గా సూపర్ స్టార్ మహేశ్ బాబు హీరోగా అనిల్ రావిపుడి డైరెక్షన్ లో వస్తున్నసరిలేరు నీకెవ్వరు మూవీలో విజయశాంతి కీలక పాత్రలో నటిస్తున్నారు. అయితే విజయశాంతి మళ్లీ ఇన్నాళ్లకు మేకప్ వేసుకుని షూటింగ్ లో పాల్గొన్నారు. ఈ విషయాన్ని డైరెక్టర్ అనిల్ రావిపుడి తన ట్విట్టర్లో తెలిపారు